
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన వల్ల రాష్ట్రానికి, దేశానికి పెద్దగా ఒరిగిందేమీ లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని తెలిపారు. ఇందులో కొత్తదేమీ లేదని ఆయన చెప్పారు.
రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రిపరేషనూ లేకుండా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చారని వినోద్ కుమార్ అన్నారు. రైతుల పట్ల ఆయనకు ఉన్న వైఖరి ఏంటో ఈ వరంగల్ సభ ద్వారా తేటతెల్లం అవుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ పలుమార్లు గుర్తించిందని, పలుమార్లు ప్రశంశలు కురిపించిందని చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ అనుసరించారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర పార్టీల నాయకులు సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న వ్యవసాయ విధానాలను అనుసరించక తప్పడం లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలనే రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రకటించారని వినోద్ కుమార్ తెలిపారు.
రైతుల పాలిట ప్రాణ సంకటంగా మారిన నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందుల విక్రయదారుల ఆట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ ను ఇప్పటికీ అమలు చేస్తోందని, ఇదే విషయాన్ని కాంగ్రెస్ తన డిక్లరేషన్ లో చెప్పిందని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. దేశంలో పుష్కలంగా సాగునీరు సౌకర్యం కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు అందిస్తున్నామని, కానీ కాంగ్రెస్ డిక్లరేషన్ లో కొత్తదనం ఏమీ లేదని మరో సారి స్పష్టం చేశారు.
ధరణి పోర్టల్ ద్వారా రెవెన్యూ రికార్డులు అన్నింటిని, భూముల వివరాలన్నీ పక్కాగా పొందుపరుస్తున్నామని అన్నారు. అయితే కాంగ్రెస్ మళ్లీ పట్వారీ వ్యవస్థను తీసుకొచ్చే విధంగా కుట్ర పన్నుతున్నట్లుగా వరంగల్ డిక్లరేషన్ ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలు సహా అనేక పరిశ్రమలు మూత పడటానికి కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణమని ఆయన విమర్శించారు. ఇప్పుడు మళ్లీ వారే మూతపడిన పరిశ్రమలను తెరిపిస్తామని అంటున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, కోవిడ్ కష్టకాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్దకే వెళ్లి కొన్నదని చెప్పారు.
రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రైతు విమోచన సమితి ద్వారా రైతులను ఆదుకుంటున్నమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ విధానం భారతదేశానికే దిక్సూచిగా నిలిస్తోందని అన్నారు. రైతులను, ప్రజలను మోసం చేసే మాటలు రాహుల్ గాంధీ కట్టిపెట్టాలని ఆయన అన్నారు.