కెటిఆర్ తోనే కెసిఆర్ అధికారం గల్లంతు

First Published Aug 2, 2017, 2:49 PM IST
Highlights
  • తెలంగాణ సర్కారుపై వరవరరావు ఆగ్రహం
  • కెటిఆర్ తోనే ఈ సర్కారు పతనం తప్పదు
  • ఇసుక మాఫియానే సర్కారును నడుపుతున్నది

తెలంగాణలో మంత్రి కెటిఆర్ చేస్తున్న అక్రమాల వల్ల కెసిఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని విరసం అధ్యక్షులు వరవరరావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇసుక మాఫియా నడుపుతోందని ఆరోపించారు. కెటిఆర్ బినామీలే ఇసుక దందా చేస్తున్నారని చెప్పారు. మంగళవారం నేరెళ్ల బాధితులను కలిసి వారిని పరామర్శించారు. జైలులో ఉన్న వారిని కూడా కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంజయ్ గాంధీ వల్ల ఇందిరా గాంధీ అధికారం కోల్పోయినట్లు ఇక్కడ కెటిఆర్ వల్ల కెసిఆర్ అధికారం కోల్పోతారని జోస్యం చెప్పారు.

గోదావరిలో దొరికే ఇసుకకు సింగపూర్, మలేషియాలో మంచి గిరాకీ ఉందని చెప్పారు. అందుకే ఇక్కడి నుంచి సింగపూర్, మలేషియాకు ఈ ఇసుకను అక్రమంగా రవణా చేస్తున్నారని, ఈ వ్యాపారమంతా కెసిఆర్ కుటుంబం కనుసన్నల్లోనే జరుగుతుందని ఆరోపించారు. అంత లాభసాటిగా ఉన్నందునే జనాలను భయభ్రాంతులకు గురిచేసి ఈ ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు.

ఇసుక మాఫియా ఆస్తులను, లారీలను జస్తు చేసి విక్రయించి ఆ సొమ్మను రోడ్డు ప్రమాద బాధితులకు, థర్డ్ డిగ్రీ బాధితులకు పంపిణీ చేయాలని వరవరరావు డిమాండ్ చేశారు. ఆరు నెలల కాలంలో ఇసుక మాఫియా చేతిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు భూమయ్య మరణం తర్వాత తట్టుకోలేక జనాలు ఇసుక లారీలను తగలబెట్టినట్లు చెప్పారు. లారీలు తగలబెట్టిన సంఘటనతో సంబంధం లేనివారిని తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్, చంద్రబాబు హయాంలో జరిగిన విధంగానే పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని తెలిపారు. తక్షణమే ఎస్పీని సస్పెండ్ చేయి ఆయన మీద, బాధ్యుల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా పాశం యాదగిరి మీద కూడా ఈ ఎస్పీ నే దాడి చేశాడని గుర్తు చేశారు. నేరెళ్ల ఘటనతోనే టిఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు వరవరరావు.

click me!