ఆంధ్రవాళ్ల సంచులు మోసేది కేసీఆరే: ఘాటుగా స్పందించిన ఉత్తమ్

First Published Apr 27, 2018, 5:35 PM IST
Highlights

ఆంధ్రవాళ్ల సంచులు మోశారని తనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

హైదరాబాద్: ఆంధ్రవాళ్ల సంచులు మోశారని తనపై తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యపై తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆంధ్రవాళ్ల సంచులు మోస్తోంది తాను కాదని కేసీఆరే ఆ పనిచేస్తున్నారని ఆయన అన్నారు. 

ప్రగతిభవన్ లో 150 గదులు ఉన్నట్లుగా తాను అన్నట్లు కేసిఆర్ చెప్పిన మాట నిజం కాదని ఆయన శుక్రవారం అన్నారు. ప్రగతి భవన్ లో 150 గదులున్నాయని తాను అనలేదని, అయితే ఒక్కటి మాత్రం నిజమని, కేసిఆర్ ప్రజాధనంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని ఆయన అన్నారు. దాన్ని నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. 

త్వరలోనే టీఆర్ఎస్ అవినీతిని బయపెడుతానని ఆయన అన్నారు. హెటిరో డ్రగ్స్ కంపెనీకి ప్రభుత్వం ఆయాచితంగా 15 ఎకరాల భూమిని కట్టబెట్టిందని ఆయన ఆరోపించారు. అతి తక్కువ ధరకు ప్రభుత్వం ఆ భూమిని అప్పగించిందని అన్నారు. 

అత్యంత కాలుష్యకారకమైన కంపెనీకి అన్ని రకాల రాయితీలు ఇవ్వడమేమిటని ఆయన అడిగారు. దాదాపు రూ.40 కోట్ల నగదు రాయితీ ఇచ్చారని ఆయన చెప్పారు. వంద శాతం జీఎస్టీ రాయితీ ఇచ్చారని అన్నారు. 

click me!