జూబ్లీహిల్స్‌‌తో పోటీ పడ్డ ఉప్పల్ భగాయత్ ల్యాండ్స్.. హెచ్‌ఎండీఏకు కాసుల పంట

By Siva KodatiFirst Published Dec 2, 2021, 9:09 PM IST
Highlights

ఉప్పల్‌ భగాయత్‌ (uppal bhagayath layout)  మూడో దశ వేలంలోనూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు (hmda) కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు తారుమారు చేస్తూ.. మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి.

భూముల అమ్మకాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం కాసుల పంట పండించుకుంటోంది. ఇప్పటికే కోకాపేట్, ఖానామెట్ భూముల (kokapet khanamet lands) వేలం ద్వారా వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరుకున్నాయి. తాజాగా ఉప్పల్‌ భగాయత్‌ (uppal bhagayath layout)  మూడో దశ వేలంలోనూ హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు (hmda) కాసుల వర్షం కురిపిస్తోంది. తొలిరోజు వేలంలో అధికారుల అంచనాలు తారుమారు చేస్తూ.. మూసీ తీరాన ప్లాట్లు గతంలో కంటే భారీ స్థాయిలో ధరలు పలికాయి. జూబ్లీహిల్స్‌ లాంటి ప్రాంతాలతో పోటీ పడుతూ ఉప్పల్‌లోనూ రెండు ప్లాట్లు చదరపు గజానికి రూ.1.01 లక్షల చొప్పున ధర పలకడం విశేషం. 

Also Read:ముగిసిన ఖానామెట్ భూముల వేలం: కోకాపేట్ కంటే భారీ ధర.. ఎకరం రూ.55 కోట్లు పైమాటే

మూడో దశలో మొత్తం 44 ప్లాట్లలో తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్‌టీఎస్‌ వేదికగా జరిగిన ఈ ప్రక్రియలో పాల్గొన్న వారు ధరలు పెంచుకుంటూ పోయారు. చదరపు గజానికి రూ.35వేల ధరను ప్రభుత్వం నిర్ణయించగా.. ఉదయం సెషన్లో ఓ ప్లాటుకు అత్యధికంగా చదరపు గజానికి రూ.77వేలు, రెండో సెషన్‌లో రెండు ప్లాట్లు ఏకంగా రూ.1.01లక్షల రికార్డు ధరలు పలికాయి. కేవలం 19 వేల చదరపు గజాలకే రూ.141.61 కోట్లు తొలి రోజు రాగా, శుక్రవారం మిగిలిన 1.15లక్షల చదరపు గజాల్లో మొత్తం 21 ప్లాట్లకు సగటున రూ.60వేలు వరకు వచ్చినా సుమారు రూ.900 కోట్లు ఖజానాకు వస్తాయని హెచ్‌ఎండీఏ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  

మల్టీ పర్పస్‌ జోన్‌కి కేటాయించిన 12.04 ఎకరాల్లో 10 ప్లాట్లతో పాటు మరో 11 ప్లాట్లను శుక్రవారం వేలం వేయనున్నారు. తొలిరోజు ప్రవాసీయులు పెద్ద ఎత్తున ఇందులో పాల్గొన్నారు. రెండో రోజు మల్టీపర్పస్‌ భూములకు చదరపు గజానికి కనీసం రూ.70వేల దాకా పలికే అవకాశాలున్నాయని అంచనా. 

click me!