తాను, తన కుమారుడు అనేదే కేసీఆర్ సిద్ధాంతమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదని... ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ను వదిలే ప్రసక్తే లేదన్నారు
తెలంగాణలో అసలైన రాజకీయ క్రీడ మొదలైందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ను వదిలే ప్రసక్తే లేదన్నారు. మోడీ పర్యటనపై కేసీఆర్ వైఖరి విచారకరమని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ప్రధానికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సరికాదని.. గవర్నర్ను పదే పదే అవమానించడాన్ని ఆయన ఖండించారు. తాను, తన కుమారుడు అనేదే కేసీఆర్ సిద్ధాంతమని.. కేటీఆర్ను సీఎం చేయాలని ఆయన కలలు కంటున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ఇదిలా ఉండగా, రామగుండంలో రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సిఎల్) ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 12న తెలంగాణకు రానున్నారు. మోదీ నవంబర్ 12న ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి హెలికాప్టర్లో రామగుండం బయలుదేరి, ప్రారంభోత్సవం అనంతరం తిరిగి హైదరాబాద్కు చేరుకుని అదే రోజు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అయితే, ఇటీవల గత కొన్నిసార్లు జరుగుతున్నట్టుగానే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధానికి ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకడం గానీ, ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడంగానీ చేయరని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
Also Read:మోడీ టూర్లో పాల్గొనకపోవడం అభివృద్దిని అడ్డుకోవడమే:కేసీఆర్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్
ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని రిసీవ్ చేసుకోవాలి. విమానాశ్రయానికి వెళ్లి కలవాల్సి ఉంటుంది. కాగా, గత ఫిబ్రవరిలో నగర శివార్లలోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో సమతా విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడు కేసీఆర్ వెళ్లలేదు. అప్పటి నుంచి మోదీ పర్యటనలన్నింటినీ ఆయన దాటవేశారు. కేసీఆర్ ప్రోటోకాల్ను పాటించకపోవడానికి ప్రధానమంత్రి 'ప్రైవేట్ పర్యటనలు' కారణమని CMOలోని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే, RFCL ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం. ఇక దీనికి ముఖ్యమంత్రిని ఆహ్వానించారా లేదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఇది అధికారిక కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం RFCL ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రికి కేంద్రం ఆహ్వానం పంపుతుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడ్డాయి.