జీహెచ్ఎంసీ కమిషనర్, హైద్రాబాద్ కలెక్టర్ మీటింగ్ కు డుమ్మా: కేంద్రమంత్రి ఫైర్

By narsimha lodeFirst Published Nov 25, 2021, 1:44 PM IST
Highlights

 దిశ కమిటీ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్, హైద్రాబాద్ కలెక్టర్ డుమ్మా కొట్టడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు.  గతంలో కూడా  కేంద్ర మంత్రి సమావేశానికి అధికారులు హాజరు కాలేదు. దీంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 


హైదరాబాద్: మరోసారి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమీక్ష సమావేశానికి హైద్రాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ గైర్హాజరయ్యారు. గతంలో కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమానికి జీహెచ్ఎంసీ అధికారులు డుమ్మా కొట్టారు. ఇవాళ మరోసారి ఇదే తరహ ఘటన చోటు చేసుకొంది. గురువారం నాడు  హైదరాబాద్ టూరిజం ప్లాజా లో నిర్వహిస్తున్న Disha committee  కమిటీ సమావేశానికి  Hyderabad collector , Ghmc కమిషనర్ డుమ్మా కొట్టారు. ఇక మీ నిర్లక్ష్యాన్ని, లెక్కచేయని తీరును ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని కేంద్ర మంత్రి Kishan Reddy  మండిపడ్డారు. గంటలో మీటింగ్ కు రాకుంటే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని మంత్రి కిషన్ రెడ్డి  ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై  చర్చించే క్రమంలో సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో సమావేశం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు.  వారు రాకపోతే చర్చ జరగదని కిషన్ రెడ్డి చెప్పడంతో కలెక్టర్ సమావేశానికి హాజరయ్యారు. స్వనిధి యోజన పథకాన్ని పథకాన్ని అధికారులు బాగా అమలు చేయాలని  కిషన్ రెడ్డి  అధికారులకు సూచించారు.  వీధి వ్యాపారులుగా గుర్తింపు కార్డులు ఇవ్వడంలో ఆలస్యమౌతుందని దాన్నిఅధిగమించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

గతంలో హైద్రాబాద్ నగరంలో వర్షాలతో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటించారు. అయితే ఈ సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు హాజరు కాలేదు. ఈ సమయంలో కూడా ఆయన అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో సంబందిత అధికారులు లేకపోవడంపై కిషన్ రెడ్డి మండిపడ్డారు.  భవిష్యత్తులో ఈ తరహా  ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకొంటామని జీహెచ్ఎంసీ అధికారులు అప్పట్లో హమీ ఇచ్చారు. కానీ ఇవాళ మాత్రం  అధికారులు మరోసారి కిషన్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. అయితే గతంలో టూర్ సమయంలో కిషన్ రెడ్డి అధికారులను సున్నితంగా మందలించారు. ఇవాళ మాత్రం గంటలోపుగా సమావేశానికి రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. రాష్ట్రానికి నిధులు తీసుకు రావడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని  టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ విమర్శలను బీజేపీ తీవరంగా ఖండిస్తోంది. 

click me!