తెలంగాణ ఆర్టీసీలో (tsrtc) ఔట్ సోర్సింగ్ సిబ్బందిని (outsourcing staff) పర్మినెంట్ చేస్తామంటూ వస్తున్న వార్తలపై టీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని సిబ్బందికి సూచించింది.
తెలంగాణ ఆర్టీసీలో (tsrtc) ఔట్ సోర్సింగ్ సిబ్బందిని (outsourcing staff) పర్మినెంట్ చేస్తామంటూ వస్తున్న వార్తలపై టీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని సిబ్బందికి సూచించింది. అంతకుముందు నూతన సంవత్సరం సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (vc sajjanar) శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సంస్థ ఏ ఒక్కరిదీ కాదని, ఇది అందరిదని అన్నారు. టీఎస్ఆర్టీసీలో పని చేసే సిబ్బంది సంతోషంగా ఉంటే సంస్థ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తాను ఇందులో పని చేసినన్ని రోజులు టీఎస్ ఆర్టీసీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు.
2021 సంవత్సరంలో చాలా ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని సిబ్బంది సమస్యకు పరిష్కారం దొరుకవచ్చని అన్నారు. ఈ ఏడాది టీఎస్ ఆర్టీసీ సిబ్బందికి మంచి జరుగుతుందని తెలిపారు. అయితే జనవరి 1 సందర్భంగా చిన్న పిల్లలకు ఈరోజు బస్సు ప్రయాణం ఉచితమని ఆయన చెప్పారు. చిన్నారులతో పాటు వారితో పాటు వచ్చే సంరక్షకులకు తెలంగాణ వ్యాప్తంగా ఉచిత ప్రయాణం కల్పించామని తెలిపారు. ఇలా చేస్తే ప్రజలకు ఆర్టీసీపై ఇంకా మంచి అభిప్రాయం కల్గుతుందని అన్నారు. అలాగే కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా శుక్రవారం రోజు ఎక్కువ సర్వీసులు సీటీ అంతటా నడిపామని తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆ సంస్థలో మార్పులు మొదలయ్యాయి. ప్రతీ విషయంలోనూ ఆయన మార్క్ నిర్ణయాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే మహిళ సిబ్బందికి రాత్రి 8 దాటిన తరువాత డ్యూటీలు వేయడం నిషేదించారు. మౌఖికంగా చెప్పిన తరువాత ఆ ఆదేశాలు అమలుకాలేదు. ఈ విషయం ఆయన దృష్టికి వచ్చిన వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాత్రి సమయంలో కండక్టర్ గా విధులు నిర్వహించే మహిళల ఇబ్బందులు తొలగిపోయాయి. అలాగే హైదరాబాద్ పరిధిలో క్రిస్మస్, డిసెంబర్ 31 రాత్రి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేలా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1వ తేదీ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారులకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎండీ సజ్జనార్... ఆ వేధిక ద్వారా తన దృష్టికి వచ్చే అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రతీ సారి దసరా సమయంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో ఛార్జీలు పెంచుతూ వస్తోంది. అయితే ఈ సారి మాత్రం అలా జరగలేదు. అలాగే రూల్స్ పాటించని అధికారుల విషయంలో కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు సజ్జనార్. ఇటీవల ఆర్టీసీ బస్సులో జన్మించిన ఇద్దరికీ జీవితాంతం బస్ ఫ్రీగా ఇచ్చారు. బస్టాండ్ ప్రాంగణంలోని ఎంఆర్పీ కంటే ఎక్కువగా వస్తువులను అమ్ముతున్న స్టాల్స్పై రూ.లక్ష ఫైన్ విధించారు. అలాగే హైదరాబాద్ పరిధిలో ఫొన్ చేస్తే ఇంటికే బస్ పాస్ తీసుకొచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇలా సమస్యలను పరిష్కరిస్తూ, కొత్త కొత్త విధానాలను ప్రవేశపెడుతూ తనదైన మార్క్ చూపిస్తున్నారు. సజ్జనార్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఎస్ ఆర్టీసీపై ప్రయాణికుల్లో సంతృప్తి పెరుగుతోంది.