
Balka Suman: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ అనగానే బీజేపీ, కాంగ్రెస్ల వెన్నులో వణుకుపుడుతోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) అన్నారు. కులగజ్జి రేవంత్, మత పిచ్చి సంజయ్కి సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్ రావు, దండే విఠల్తో బాల్క సుమన్ టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ భారత జాతికి ద్రోహం చేసిన పార్టీలనీ, కేసీఆర్ కాలం చెల్లిన మెడిసిన్ కాదు.. ప్రాణం పోసే సంజీవని అని ప్రజలకు తెలుసన్నారు. పార్టీ అధ్యక్షురాలు మీద ఈడి నోటీస్ ఇస్తే కాంగ్రెస్ ధీటుగా పోరాడటం లేదనీ కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యాడు.
కేంద్ర ప్రభుత్వం పై ఆయన విరుచకపడుతూ.. బీజేపీది ఢిల్లీలో తుగ్లక్ పాలన.. గల్లీలో తుగ్లక్ వాదన అని ఏద్దేవా చేశారు. బీజేపీ ఉన్మాదాన్ని, దుర్మార్గాలను దేశ ప్రజల ముందు పెడతామని అన్నారు. మరో పోరాటానికి దేశం సిద్ధ పడుతుందనీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు.
రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలనీ, లేదంటే తగిన బుద్ది చెబుతామని సుమన్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఐసియూలో ఉందని అన్నారు. బండి సంజయ్ కి చేతనైతే విభజన హామీలు అమలు చేసి చూపించాలని సవాల్ విసిరారు. రెండు జాతీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులు విఫలం అయ్యారనీ, బండి,రేవంత్ ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కుక్కలు ఎన్ని మొరిగినా.. తెరాస ఎంచుకున్న దారిలో ముందుకు వెళ్తుందని అన్నారు.
జాతీయ రాజకీయాలపై తమ పార్టీలో చర్చ జరిగితే.. జీర్ణించుకోలేని స్థితి ఉన్నారు. చర్చిస్తే జాతీయ పార్టీల్లో వణుకు మొదలైందని అన్నారు. దేశాన్ని గట్టెక్కించేది కెసిఆర్ మాత్రమేనని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వాలను బీజేపీ పడగొడితే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదనీ, కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బీజేపీకి లొంగి పోయిందని అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ విధానాలను దేశ ప్రజల ముందు పెడుతామని అన్నారు. బీజేపీ వైఫల్యాలను దేశంలో చర్చకు తెస్తామని అన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందు విభజన హామీలు అమలు చేయాలని సవాల్ విసిరారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ మాట్లాడుతూ.. బీజేపీ అంటేనే కాంగ్రెస్ భయపడుతోందని, ప్రతిపక్ష పాత్ర పోషించే స్థితిలో లేదన్నారు. దేశంలో నియంత పాలన సాగుతోందని, దాన్ని సరిదిద్దేందుకు కేసీఆర్ కొత్త ఎజెండా సిద్ధం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ లకు రాష్ట్ర పరిస్థితి గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.