కేసీఆరే మీకు పెద్దదిక్కు... అధైర్యపడొద్దు: బాధిత కార్యకర్తల కుటుంబాలకు కేటీఆర్ భరోసా

By Arun Kumar PFirst Published Aug 4, 2021, 4:20 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తల కుటుంబాలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇటీవల మరణించిన కార్యకర్తల కుటుంబాలతో లంచ్ చేసిన కేటీఆర్ ప్రమాద భీమా చెక్కులను అందించారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆపదలో వున్న ప్రతి కార్యకర్త కుటుంబానికి పెద్దదిక్కుగా వుంటారని వర్కింగ్ ఆ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.  ప్రమాదాల్లో మరణించిన కార్యకర్త ఇంటికి నేడు పెద్దదిక్కు లేకున్నా పార్టీ, కేసీఆర్ అండగా ఉన్నారన్నారు.  

ప్రమాదాల్లో మరణించిన 80 మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్ లో కేటీఆర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత రూ.2 లక్షల చొప్పున పార్టీ తరపున ప్రమాద భీమా చెక్కులు అందజేశారు. 

చెక్కుల పంపిణీ అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.... టీఆర్ఎస్ పార్టీ  60లక్షల సభ్యత్వం కలిగిన అజేయ శక్తిగా ఎదిగిందన్నారు. ఈ 60లక్షల మంది కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబమేనని అన్నారు. 

read more  శాలపల్లి: నాడు రైతుబంధు, నేడు దళితబంధు శ్రీకారానికి ప్లాన్

''ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలు అధైర్యపడొద్దు. మరణించిన కుటుంబ సభ్యుల బాధ్యత టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలపై ఉంది. బాధిత కుటుంబాలకు త్వరితగతిన పార్టీ  తరపున భీమా డబ్బులు వచ్చేలా చూడాలి'' అని కేటీఆర్ ఆదేశించారు. 

''ప్రాణాలు కోల్పోయిన 80 మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబసభ్యుల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరిస్తాం. గత సంవత్సరం 950 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రమాదాల్లో మరణించారు. వారి కుటుంబాలను కూడా ఆదుకుంటాం. పార్టీని కాపాడుతున్న కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం'' అని పేర్కొన్నారు. 

''ఈ సారి పార్టీ కార్యకర్తల ప్రమాద బీమా కోసం 18 కోట్ల రూపాయల చెక్కును ఇన్సూరెన్స్ కంపెనీకి ఈ రోజే అందజేస్తున్నా. మీ ఇంట్లో వాళ్ళు మీకు దూరం అయినా కేసీఆర్, టీఆరెస్ పార్టీ మీకు ఉంది. గుండె నిబ్బరం చేసుకోండి... అధైర్య పడకండి ...పార్టీ ఎల్లపుడూ మీకు అందుబాటులో ఉంటుంది'' అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. 

click me!