దర్యాప్తు సంస్థల దుర్వినియోగం: కేంద్రంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్

By narsimha lodeFirst Published Nov 22, 2022, 4:45 PM IST
Highlights

కేంద్ర  ప్రభుత్వం  దర్యాప్తు  సంస్థలను  దుర్వినియోగం  చేస్తుందని  టీఆర్ఎస్  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్  రెడ్డి  చెప్పారు.   రైతుల  సంక్షేమం  కోసం  పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న కేంద్రం  ఆ స్థాయిలో  కార్యక్రమాలు  చేయడం  లేదన్నారు.

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం  దర్యాప్తు  సంస్థలను  దుర్వినియోగం  చేస్తుందని  టీఆర్ఎస్  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్  రెడ్డి  ఆరోపించారు.మంగళవారంనాడు టీఆర్ఎస్  శాసనసభపక్ష కార్యాలయంలో ఆయన  మీడియాతో  మాట్లాడారు.గతంలో  తెలంగాణ  మంత్రి  గంగుల  కమలాకర్  గ్రానైట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించారన్నారు.  ఇవాళ  తెలంగాణ  మంత్రి  మల్లారెడ్డి  నివాసాల్లో సోదాలు  నిర్వహిస్తున్నారని ఆయన  చెప్పారు.

రైతులు  వ్యవసాయాన్ని  మానేసేలా  కేంద్ర ప్రభుత్వ విధానాలున్నాయని  ఎమ్మెల్సీ  పల్లా రాజేశ్వర్ రెడ్డి  ఆరోపించారు.కేంద్ర ప్రభుత్వం  రైతుల  ఉసురుపోసుకుంటుందని  ఆయన  చెప్పారు.కనీస మద్దతు  ధర అందక  రైతులు  తీవ్రంగా  నష్టపోతున్నారని  ఆయన  చెప్పారు.  తమ  ప్రభుత్వం  రైతాంగం  సంక్షేమం  కోసం  ప్రయత్నిస్తున్నామని  పల్లా రాజేశ్వర్ రెడ్డి  తెలిపారు.  గతంలో  పోలిస్తే  తమ  ప్రభుత్వం  అత్యధికంగా  రైతులకు రైతు  బంధు  పథకం  కింద  వ్యవసాయ  పెట్టుబడులు అందిస్తున్నట్టుగా  పల్లా  రాజేశ్వర్  రెడ్డి తెలిపారు.పీఎం కిసాన్  యోజన  పథకం  కింద లబ్దిదారుల  సంఖ్య   ప్రతి  ఏటా  తగ్గుతూ  వస్తుందని ఆయన  ఎద్దేవా చేశారు. ఈ  ఏడాది  కేవలం  3 కోట్ల  మందికే  ఈ  లబ్దిని  కేంద్రం పరిమితం  చేసిందని ఆయన  విమర్శించారు.  

యూపీ  ఎన్నికల సమయంలో  రైతుల  సంక్షేమం  విషయంలో  బీజేపీ  ఇచ్చిన  వాగ్దానాలను  ప్రస్తుతం  అమలు  చేయడం లేదని  ఆయన చెప్పారు.ః బీజేపీ  పాలిత  రాష్ట్రాల్లో  రైతులు ఆత్మహత్యలు  చేసుకుంటున్నారన్నారు. కానీ  తెలంగాణలో  రైతుల  ఆత్మహత్యలు తగ్గినట్టుగా  ఆయన  తెలిపారు. ఈ  విషయమై  నేషనల్  క్రైమ్  బ్యూరో రికార్డులను  ఆయన  గుర్తు చేశారు. రైతాంగానికి  ఉచితంగా  విద్యుత్ ను  సరఫరా  చేస్తున్నట్టుగా  ఎమ్మెల్సీ  రాజేశ్వర్  రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం  అమలు  చేస్తున్న  రైతు  బంధు  వంటి పథకాలను  అమలు  చేయాలని  పలు  రాష్ట్రాల  ప్రజలు కోరుతున్న  విషయాన్ని రాజేశ్వర్  రెడ్డి  గుర్తు  చేశారు. తెలంగాణకు  సరిహద్దుల్లోని  గ్రామాల ప్రజలు  ఆయా ప్రభుత్వాలను  డిమాండ్  చేస్తూ ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. 

 

 

click me!