
ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ (bathukamma) పండుగ విశిష్టత గురించి తెలియజేసేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha). బుధవారం నిజామాబాద్లో (nizamabad) జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఈ నెల 23న దుబాయ్లో బతకమ్మ పండుగపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని.. దీనికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (ar rahman) కూడా హాజరుకానున్నారని కవిత తెలిపారు.
ఒకప్పుడు బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి కోర్టుకు వెళ్లిన విషయాన్ని కవిత గుర్తుచేశారు. అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వమే ఘనంగా బతుకమ్మను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. బతుకమ్మ పండుగను అధికారంగా జరుపుకోవడం, బతుకమ్మ చీరలు ఇవ్వడం, తంగేడు రాష్ట్ర పువ్వు కావడం లాంటివన్నీ తెలంగాణ ఆడబిడ్డలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని కవిత పేర్కొన్నారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ రూపొందించిన బతుకమ్మ పాట ద్వారా, బతుకమ్మ పండుగపై మరోసారి దేశ విదేశాల్లో చర్చ జరిగిందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కాగా, నిజామాబాద్ లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా కమీషన్ సభ్యురాలు సుధాం లక్ష్మి, మేయర్ నీతూ కిరణ్, జిల్లా కలెక్టర్ సతీమణి మనీషా, పోలీస్ కమీషనర్ సతీమణి రీచా, జెడ్పీ ఛైర్మన్ సతీమణి అనసూయ, మహిళా ప్రజాప్రతినిధులు, ఆడబిడ్డలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
అంతకుముందు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కవిత సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.'పూల పండుగతో తెలంగాణ పులకించింది. ఎంగిలిపూల బతుకమ్మ నుండి సద్దుల బతుకమ్మ వరకు ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ఆడబిడ్డలందరికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నమైన సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
అటు ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr) కూడా రాష్ట్ర ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. తొమ్మిది రోజులుగా తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఆనందోత్సాహాల నడుమ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకోవడంపై సీఎం సంతోషం వ్యక్తం చేశారు. బతుకమ్మ స్ఫూర్తితో ప్రకృతిని, పచ్చదనాన్ని, నీటి వనరులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
"