
జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వ్యవహర తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం ఆయన ఓ ప్రభుత్వ అధికారిని గల్లా పట్టుకుని.. కొట్టినంత పని చేశారు. అయితే ఈ ఘటనకు టీఆర్ఎస్లోని వర్గ విభేదాలే కారణమని తెలుస్తోంది. వివరాలు.. ఈరోజు గద్వాల పట్టణంలో బీసీ గురుకుల సంక్షేమ పాఠశాల ప్రారంభించాల్సి ఉంది. అయితే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాకముందే.. జెడ్పీ చైర్పర్సన్ సరిత పాఠశాలను ప్రారంభించారు. అయితే తాను అక్కడికి వచ్చేసరికే పాఠశాల ప్రారంభం కావడంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను రాకముందే పాఠశాలను ఎలా ప్రారంభిస్తారని జెడ్పీ చైర్పర్సన్ సరితను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఇందుకు సరిత సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డ అక్కడే ఉన్న ఓ అధికారి గల్లా పట్టుకున్నారు. అతడిని కొట్టినంత పనిచేశారు. అయితే అక్కడే ఉన్న కొందరు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో0 అక్కడున్నవారు కూడా షాక్ తిన్నారు. అయితే ప్రోటోకాల్ పాటించనందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కోపం ఉండవచ్చని.. కానీ ఇలా అధికారిపై దాడి చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి తీరును పలువురు తప్పుబడుతున్నారు.
ఇదిలా ఉంటే.. గద్వాల టీఆర్ఎస్లో గత కొంతకాలంగా గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి.. నియోజకవర్గంలోని పలువురు ముఖ్య నాయకుల మధ్య గ్యాప్ కొనసాగుతుంది. జెడ్పీ చైర్ పర్సన్ సరితతో కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని టీఆర్ఎస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పలువురు నేతలను దూరం పెట్టడానికి రాజకీయపరమైన అంశాలే కారణమని టాక్ వినిపిస్తోంది.