ఐదు రోజుల్లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తేల్చి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ తో జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పీఏసీ సమావేశం వాడీ వేడీగా జరిగిందని సమాచారం.
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి ఐదు రోజుల్లో తాను రాజీనామా చేస్తానని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy తేల్చి చెప్పారు. Congress పార్టీ పీఏసీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహరా ఇంచార్జీ Manickam Tagore కు జగ్గారెడ్డి తెగేసి చెప్పారు. పీఏసీ సమావేశం బుధవారం నాడు సాయంత్రం ఆన్లైన్ లో జరిగింది.
ఐదు రోజుల్లో తాను ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సవాల్ విసిరారని చెప్పారు. తాను సంగారెడ్డిలో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానన్నారు.అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అభ్యర్ధికి హుజూరాబాద్ లో కంటే తక్కువ ఓట్లు వస్తాయని జగ్గారెడ్డి చెప్పారని సమాచారం.
కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (pac)సమావేశం లో సోషల్ మీడియాలో పార్టీకి చెందిన కొందరు నేతలపై తప్పుడు ప్రచారంపై చేయడంపై చర్చ సాగిన సమయంలో జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలను ఉద్దేశ్యపూర్వకంగా టీఆర్ఎస్ కు కోవర్టులు అంటూ ప్రచారం చేయడంపై మండి పడుతున్నారు.
ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జగ్గారెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, గీతారెడ్డి శ్రీధర్ బాబు, అనిల్ కుమార్ రెడ్డి తదితరులు జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే?
కాంగ్రెస్ పార్టీ ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం రచ్చకు దారి తీసింది. ఈ కార్యక్రమం గురించి కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించకుండానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంపై జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ కార్యక్రమం గురించి తనకు సమాచారం ఇవ్వకపోవడాన్ని జగ్గారెడ్డి తప్పుబట్టారు. టీపీసీసీ చీఫ్ Revanth Reddy తీరుపై మండిపడ్డారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీకి జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుండి తప్పించాలని కూడా కోరారు.
అయితే జగ్గారెడ్డి లేఖ రాయడం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. అయితే ఈ లేఖ మీడియాకు చేరిన అంశం క్రమశిక్షణ ఉల్లంఘనే అని ఆ పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మెన్ చిన్నారెడ్డి తేల్చి చెప్పారు.ఈ వ్యాఖ్యలు జగ్గారెడ్డికి ఆగ్రహం తెప్పించాయి. క్రమశిక్షణ సంఘం చైర్మెన్ Chinna Reddy తీరును కూడా జగ్గారెడ్డి తప్పుబట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి క్రమశిక్షణ సంఘం ముందు హాజరైతే ఆ తర్వాత తాను కూడా క్రమశిక్షణ సంఘం ముందు హాజరౌతానని జగ్గారెడ్డి ప్రకటించారు. ఓ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో మాట్లాడితే పార్టీ మారుతానని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి మండి పడ్డారు.
గతంలో సీఎం వద్ద సమావేశానికి వెళ్లిన clp నేత Mallu Bhatti Vikramarka పై కూడా ఇదే రకంగా ప్రచారం చేశారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా పార్టీలో కొందరి నేతల అనుచరులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో కోవర్టులు అంటూ చేసిన ప్రచారం విషయమై కూడా చర్చ సాగుతుంది.
Sonia Gandhiకి జగ్గారెడ్డి ఫిర్యాదు చేయడం వెనుక పార్టీ సీనియర్లు ఉన్నారని రేవంత్ రెడ్డి వర్గం అనుమానిస్తోంది. పార్టీలోని ఇతర నేతలను కలుపుకుపోవాలని రేవంత్ రెడ్డికి కూడా పార్టీ అధిష్టానం కూడా సూచించినట్టు సమాచారం. గతంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో పార్టీ నేత కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డి కి సూచించినట్టుగా సమాచారం. జగ్గారెడ్డి తీరుపై పార్టీ నాయకత్వం సంతృప్తిగా లేదనే సమాచారం.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం వంటి అంశాలు కూడా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి వచ్చాయి.