
జనగామ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవ రెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఇవాళ హైదరాబాద్ గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి జంగా రాఘవ రెడ్డితో పాటు నాయిని రాజేందర్ రెడ్డిలు డుమ్మాకొట్టారు. దీంతో పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా జంగా రాఘవరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఇకపోతే.. జంగా రాఘవరెడ్డి తీరుపై హన్మకొండ డీసీసీ నాయిని రాజేందర్ రెడ్డి ఏకంగా ప్రెస్మీట్ పెట్టి బహిరంగంగా విమర్శలు గుప్పించడం ఇటీవల కలకలం రేగింది. జనగామ జిల్లాకు రాఘవరెడ్డి డీసీసీ కాదని.. విపక్షాలకు లాభం కలిగిలా జంగా పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్యర్తో కలిసి తనకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు అతికించాడని నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన అనుమతి లేకుండా హనుమకొండ జిల్లాలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడని.. తనకే టికెట్ వస్తుందని అంటున్నాడని జంగాపై రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. గతంలోనూ జంగాపై ఫిర్యాదు చేశామని.. ఆయనకు పార్టీ పెద్దలు షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారని నాయిని గుర్తుచేస్తున్నారు. ఆయన వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోందని.. జంగా ప్రాథమిక సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నామని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. తీర్మానం కాపీని అధిష్టానానికి పంపించామని.. అక్కడి స్పందనను బట్టి , తన రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తామని రాజేందర్ రెడ్డి వెల్లడించారు.