
గాంధీ భవన్లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొత్త పీసీసీ కార్యవర్గ సభ్యులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అయితే ముందుగా చెప్పినట్లుగానే సీనియర్లు ఈ భేటీకి గైర్హాజరయ్యారు.
కాగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నేతలు ఏకమయ్యారు. అసలు కాంగ్రెస్ నాయకులకు పార్టీలో అన్యాయం జరుగుతుందనే వాదన వినిపించారు. దీంతో వలస వచ్చిన నాయకులు వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులుగా పరిస్థితి మారిందనే చెప్పాలి. ఇందుకు శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన సీనియర్ నేతల సమావేశం వేదికగా నిలిచింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, మధుయాష్కిలతో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ALso REad: రేవంత్ ను బలహీనపర్చే కుట్ర: కాంగ్రెస్ సీనియర్లపై అనిల్ ఫైర్
ఈ సమావేశం అనంతరం నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పేరు ఎత్తకుండా ఆయనపై కామెంట్స్ చేశారు. మరోవైపు తెలంగాణలో పార్టీ పరిస్ధితి నానాటికీ దిగజారిపోతుండటం, కుమ్ములాటలు మరింత ఎక్కువ కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ అప్రమత్తమైంది. దీనిలో భాగంగా సీనియర్ నేతలందరినీ ఢిల్లీకి రావాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో అధిష్టానం వద్దే తాడోపేడో తేల్చుకోవాలని సీనియర్లు డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం పార్టీలోనే నెలకొన్న వాస్తవ పరిస్ధితులను ముక్తకంఠంతో అధిష్టానానికి వినిపించే యోచనలో సీనియర్లు వున్నారు.
అటు కాంగ్రెస్ పార్టీని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే అనిల్ ఆరోపించారు. ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాదయాత్రను దెబ్బతీసేలా సీనియర్లు వ్యవహరిస్తున్నారన్నారు. టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్ లో చేరిన సమయంలో ఎందుకు సేవ్ కాంగ్రెస్ అనే నినాదాన్ని తీసుకోలేదో చెప్పాలన్నారు. ఇప్పుడు ఏం జరిగిందని సేవ్ కాంగ్రెస్ అంటున్నారో చెప్పాలని అనిల్ ప్రశ్నించారు. 2014 నుండి ఇప్పటివరకు 19 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారని ఆయన చెప్పారు.