
టీ.కాంగ్రెస్ (congress) నేతలపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చర్యలు చేపట్టింది. అద్దంకి దయాకర్కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. క్రమశిక్షణ ఉల్లంఘించి వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. వారం లోగా వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ సంఘం కోరే అవకాశం వుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
కాగా.. పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై అద్దంకి దయాకర్ ఆరోపణలు చేశారు. వీరు ముగ్గురిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ పెద్దలందరికీ ఫిర్యాదు చేశారు. తనను రాజకీయంగా అంతం చేయడానికి ఈ ముగ్గురూ కలిసి కుట్ర చేశారంటూ సోనియాకు రాసిన లేఖలో ఆయన ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గంలో తన ప్రత్యర్ధులను ప్రోత్సహిస్తున్నారని అద్దంకి దయాకర్ ఆరోపిస్తున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్గా పోటీచేసిన వడ్డేపల్లి రవిని మళ్లీ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు దయాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు రాహుల్ గాంధీ చెప్పినా లెక్కచేయని రవిని మళ్లీ ఎలా పార్టీలోకి తీసుకొస్తారని అద్దంకి దయాకర్ ప్రశ్నిస్తున్నారు.
2018 ఎన్నికల్లో వడ్డేపల్లికి 2,700 ఓట్లు రాగా, తాను కేవలం 1800 ఓట్లతో ఓడిపోయానని దయాకర్ గుర్తు చేశారు. నాటి ఎన్నికల్లో తనను ఓడించేందుకు టీఆర్ఎస్తో డీల్ కుదుర్చుకుని, కాంగ్రెస్ రెబల్గా రవి పోటీచేశాడని అద్దంకి ఆరోపించారు. అలాంటి వ్యక్తిని మళ్లీ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్రెడ్డి ప్రయత్నిస్తున్నారని అధిష్టానానికి దయాకర్ ఫిర్యాదు చేశారు.