
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన బిడ్డలు కేటీఆర్, కవిత లపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వందకోట్ల లిక్కక్ స్కామ్ కు పాల్పడ్డారంటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై విచారణ జరపిస్తున్న బిజెపి ప్రభుత్వం లక్షకోట్లు దోచుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఎందుకు విచారణ చేయించడంలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టే డిల్లీ బిజెపి నేతలు, బిఆర్ఎస్ ఒక్కటేనని అర్థమవుతుందని రేవంత్ పేర్కొన్నారు.
కేసీఆర్ కు దుబాయ్ అంటే చాలా ఇష్టమని... తెలంగాణలో దోచుకున్న సొమ్ముతో ఆయన అక్కడ సెటిల్ అవుతారంటూ రేవంత్ ఎద్దేవా చేసారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ రాష్ట్రాన్నే కాదే దేశాన్ని విడిచి పారిపోవడం ఖాయమని రేవంత్ అన్నారు.
ఇక సీఎం కేసీఆర్ తనయుడు, ఐటీ మంత్రి కేటీఆర్ ఇటీవల డిల్లీకి వెళ్లడంపైనా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నట్లు హైదరాబాద్ రోడ్ల విస్తరణ, మెట్రో రైలు వంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు... కల్వకుంట్ల కుటుంబ అక్రమాస్తులను కాపాడుకునేందుకే డిల్లీకి వెళ్లారన్నారు. ఇటీవల కల్వకుంట కుటుంబానికి చెందినవారి కంపనీలపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయని... ఈ క్రమంలోనే భారీగా ఆస్తుల వివరాలు బయటపడ్డాయని అన్నారు. ఈ ఐటీదాడుల వివరాలు బయటకురాకుండా కేటీఆర్ మీడియాను మేనేజ్ చేసారని రేవంత్ అన్నారు.
ఐటీ దాడుల్లో పట్టుబడ్డ తమ ఆస్తులను కాపాడుకునేందుకే కేటీఆర్ డిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసారని రేవంత్ అన్నారు. పదేళ్ళుగా తెలంగాణలో దోచుకుని కూడబెట్టిన ఆస్తుల కోసమే తప్ప ప్రజలకోసం కేటీఆర్ డిల్లీకి వెళ్ళలేదన్నారు. డిల్లీ బిజెపి నేతలు, కేసీఆర్ ఒక్కటేనని రేవంత్ రెడ్డి అన్నారు.
ఇప్పటికైనా తెలంగాణ బిజెపిలో వుంటూ బిఆర్ఎస్ ను ఎదిరించాలనుకునే భ్రమలో నాయకులు వుండొద్దని రేవంత్ సూచించారు. బిజెపి, బిఆర్ఎస్ ది సాదాసీదా బంధం కాదు ఫెవికాల్ బంధమని అన్నారు. బిఆర్ఎస్ ను ఓడించాలంటూ కాంగ్రెస్ తోనే సాధ్యమని... అందుకోసం కాంగ్రెస్ లోకి రావాలని రేవంత్ సూచించారు. డిల్లీ చుట్టు తిరగడం కంటే తెలంగాణ గల్లీల్లో తిరుగుతూ తెలంగాణకు విముక్తి కల్పిద్దామని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.