
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పనితనం ఆధారంగానే టికెట్లు కేటాయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరు నెలల పాటు కష్టపడి పనిచేయాలని, అప్పుడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా పనిచేసిన వారికి తప్పకుండా మంచి భవిష్యత్తు వుంటుందని.. దీనికి బోసురాజే మంచి ఉదాహరణ అని రేవంత్ గర్తుచేశారు.
అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ ఉపాధ్యక్షులకు తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే క్లాస్ పీకారు. ఇన్ఛార్జ్లు.. కేటాయించిన నియోజకవర్గాలో తిరగడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే కుదరదని.. నెలలో కనీసం నాలుగు సార్లు నియోజకవర్గాల్లో తిరగాలని థాక్రే తేల్చి చెప్పారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం టికెట్ల విషయంలో కుండబద్ధలు కొట్టారు. వచ్చే ఆరు నెలలు కష్టపడి పనిచేయాలని.. పని తీరు ఆధారంగానే టికెట్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను అభినందిస్తూ తీర్మానం చేశారు.