
బీఆర్ఎస్ అభ్యర్ధుల తొలి జాబితాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఓటమిని ఒప్పుకున్నారని దుయ్యబట్టారు. మధ్యాహ్నం 12.03లకు అభ్యర్ధుల జాబితాను ప్రకటిస్తానన్నారని.. కానీ ఆ ముహూర్తానికే లిక్కర్ టెండర్ల డ్రా తీశారని రేవంత్ ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజలకు నమ్మకం కుదిరిందని.. సిట్టింగ్లకు సీటు ఇవ్వాలని, గజ్వేల్లో పోటీ చేయాలని సవాల్ చేవానని ఆయన తెలిపారు. కానీ సిట్టింగ్లను మార్చారని రేవంత్ దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజలకు నమ్మకం కుదిరిందని రేవంత్ అన్నారు.
కాగా.. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ప్రకటించారు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగా లేని ఏడుగురు సిట్టింగ్లకు సీట్లు నిరాకరించారు. అలాగే అక్టోబర్ 16న వరంగల్ భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. అదే రోజున మేనిఫెస్టోను ప్రకటిస్తామని వెల్లడించారు. నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కరించేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తామని సీఎం తెలిపారు.
ALso Read: అక్టోబర్లో 16న వరంగల్లో భారీ ర్యాలీ.. అదే రోజున బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో : కేసీఆర్
పరిస్ధితులను బట్టి అభ్యర్ధులును మారుస్తామని.. ఈ విధంగానే ఏడు చోట్ల మార్పులు జరిగాయని కేసీఆర్ వెల్లడించారు. నాలుగు స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించాల్సి వుందని సీఎం పేర్కొన్నారు. 95 నుంచి 105 సీట్లు గెలుస్తామని.. నేతల విజ్ఞప్తితోనే కామారెడ్డిలో పోటీ చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా చర్యలు తప్పవని కేసీఆర్ హెచ్చరించారు.