
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో ఆయన భేటీ అయ్యారు. ఎల్లుండి మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీకానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
పొంగులేటి, జూపల్లిలు కాంగ్రెస్లో చేరిన తర్వాత ఖమ్మం, మహబూబ్ నగర్లలో బహిరంగ సభలు నిర్వహించాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ సభల్లోనే నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్టుగా సమాచారం. ఇక, ఇప్పటికే జూపల్లి కృష్ణారావు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కాంగ్రెస్ నేత సంపత్.. జూపల్లి కృష్ణారావుతో ప్రత్యేకంగా సమావేశమై ఆయనను పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.
ALso Read: కాంగ్రెస్లో పొంగులేటి, జూపల్లి, కూచుకుళ్ల చేరికకు ముహుర్తం ఫిక్స్..!!
ఇక, రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూమ్ కాల్ ద్వారా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. జూమ్ మీటింగ్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ జూమ్ సమావేశం తర్వాత పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరికపై స్పష్టత వచ్చిందనే ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ గూటికి పొంగులేటిని తీసుకురావడంతో కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా కీలక భూమిక పోషించారనే ప్రచారం సాగుతుంది.