చికోటి ‘చీకటి’ మిత్రుడెవరో.. కేటీఆర్ నోరుమెదపరేం, ఆ స్టిక్కర్ దొంగిలించింది ఎవరు : రేవంత్

By Siva KodatiFirst Published Jul 30, 2022, 8:11 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన చికోటి ప్రవీణ్ కుమార్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చికోటి వ్యవహారంపై కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. చికోటి వ్యవహారంలో చీకటి మిత్రుడెవరో బయటకు రావాలని రేవంత్ డిమాండ్ చేశారు. 

కేసీఆర్ (kcr) పాలనలో నాలుగు కోట్ల మంది జనం దగాపడ్డారని మండిపడ్డారు టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy). శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణను కేసీఆర్ (kcr) కుటుంబం దోచుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ప్రజలకు అండగా నిలబడి ప్రభుత్వంతో కోట్లాడుతున్నామని ఆయన తెలిపారు. వరదలతో 11 లక్షల ఎకరాల పంట నష్టం జరిగిందని.. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు వరదలతో నష్టం జరిగిందని (telangana floods) రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజుల నుంచి కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. 

తండ్రి కొడుకుల చేతిలో తెలంగాణ పూర్తిగా నష్టపోతోందని రేవంత్ ఆరోపించారు. వరద బాధితులను ఆదుకోవాలని పార్లమెంట్‌లో నోటిసులిచ్చినా పట్టించుకోలేదన్నారు. సమస్యలు గాలికొదిలేసి.. గాడిద పళ్లు తోమారా అని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకు కాలు జారి.. ఇంట్లో హోమ్ థియేటర్‌లో కూర్చొన్నాడని, కేసీఆర్ ఢిల్లీలో కూర్చున్నారని ఇద్దరినీ సాగనంపాలని ఆయన పిలుపునిచ్చారు. చికోటి వ్యవహారంలో చీకటి మిత్రుడెవరో బయటకు రావాలని.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరున్నారో బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

Also REad:క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. ఏడుగురికి నోటీసులు.. బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు..!

ఓ మంత్రి స్టిక్కర్ ఎవరో దొంగతనం చేశారంటారని.. ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరున్నారో బయటపెట్టాలని రేవంత్ డిమాండ్ చేశారు. చికోటి వ్యవహారంపై న్యాయ విచారణ చేయించాలన్నారు. విచారణ చేయించుకుంటే కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్నట్లేనని రేవంత్ వ్యాఖ్యానించారు. చికోటి వ్యవహారంపై కేటీఆర్ (ktr) ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. 

అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలల్లో ఆహారం కలుషితమై విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్న వ్యవహారంపై శనివారం ఉదయం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?... భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు  పిల్లల ప్రాణాల విలువ తెలుసా?.. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్’’ అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. 

click me!