మంత్రి పువ్వాడపై తుమ్మల ఫైర్.. ఖాసీం రజ్వీతో పోలిక

By Mahesh KFirst Published Oct 21, 2023, 9:42 PM IST
Highlights

మంత్రి పువ్వాడపై తుమ్మల నాగేశ్వరరావు ఫైర్ అయ్యారు. మంత్రి పువ్వాడ మంచి చేయాల్సిందిపోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆగ్రహించారు. పువ్వాడను ఖాసీం రజ్వీతో పోల్చారు.
 

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది. పూర్తిగా క్యాంపెయిన్ మోడ్‌లోకి పాలిటిక్స్ వచ్చేశాయి. నేతల వాగ్బాణాలు జోరందుకున్నాయి. తాజాగా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై మండిపడ్డారు. పువ్వాడను ఖాసీం రజ్వీతో పోల్చారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మైనార్టీ నేతలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తన నలభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మైనార్టీలు తనకు అండగా నిలబడ్డారని, తాను కూడా మైనార్టీలకు సంక్షేమంతోపాటు ఎన్నో రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేలా పని చేశానని వివరించారు. ఖమ్మంలోనూ ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. 

ఇదే సమయంలో మంత్రి పువ్వాడ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పువ్వాడను ఖాసీం రజ్వీతో పోల్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి కావాలని ప్రజలు అడిగేవారని, కానీ, నేడు తమ భూములు కబ్జా అయ్యాయని లిస్టు పట్టుకుని వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. పోలీసు అధికారులు సైతం అధికారం ఉన్నవారి వైపే నిలుస్తున్నారని వాపోతున్నట్టు తెలిపారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. 

Also Read : 19 సీట్లలో కనీసం 14 సీట్లు మాదిగలకు ఇవ్వాలి: మందకృష్ణ మాదిగ డిమాండ్

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన పదవీ కాలంలో మంచి చేయాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని తుమ్మల ఆగ్రహించారు. నేటి ఆధునిక కాలంలో ఇలాంటి పాలన సాగిస్తున్నారంటే అది సిగ్గుచేటు అని పేర్కొన్నారు.

click me!