
ఉత్తర భారతాన్ని భారీ వర్షాలు వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు పోటెత్తుతున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో కుంభవృష్టి కురుస్తోంది. కాగా.. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు చిక్కుకుపోయారు. మనాలిలో వీరు చిక్కుకుపోయినట్లుగా తెలుస్తోంది. ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ వస్తుండటంతో వీరి క్షేమ సమాచారంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వీరిని బానోత్ కమలాలాల్, రోహిత్ సూరి, శ్రీనివాస్గా గుర్తించారు. మరోవైపు డాక్టర్ల ఆచూకీ కోసం తెలంగాణ డాక్టర్ల సంఘం న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్ కార్యాలయాన్ని సంప్రదించింది.
ఇదిలావుండగా.. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో కొందరు తెలుగు విద్యార్ధులు చిక్కుకున్నట్లుగా సమాచారం అందడంతో మంత్రి కేటీఆర్ అప్రమత్తమయ్యారు. ఈ మేరకు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ ను ఆయన అప్రమత్తం చేశారు. కులు, మనాలిలో కొందరు విద్యార్ధులు చిక్కుకుపోవడంపై పేరేంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కేటీఆర్కు కొందరు విద్యార్థుల పేరేంట్స్ సమాచారం ఇచ్చారు.
ALso Read: హిమాచల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు: ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ ను అప్రమత్తం చేసిన కేటీఆర్
తమ పిల్లలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్ న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్ను అప్రమత్తం చేసి... హిమాచల్ ప్రదేశ్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వరాష్ట్రానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో ఏమైనా సహాయం అవసరమైతే తమను సంప్రదించాలని మంత్రి కోరారు.
మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్ లో వరదల్లో చిక్కుకున్న వారి కోసం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. సహాయం కోసం 9643723157, 9871999044 ఫోన్ చేయవచ్చని ప్రభుత్వం తెలిపింది. అలాగే rctelangana@gmail.com లో ఫిర్యాదు చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.