ఎన్నికల సంఘం పరీక్ష.. ఫెయిల్ అయిన ఆర్వో అధికారులు

By ramya neerukondaFirst Published Nov 10, 2018, 10:33 AM IST
Highlights

ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన సర్టిఫైడ్‌ శిక్షణ కార్యక్రమానికి హాజరై, పరీక్ష రాసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారు(ఆర్‌వో)ల్లో నాలుగో వంతుకు పైగా అధికారులు ఫెయిలయ్యారు.

వచ్చే నెలలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ  ఎన్నికల్లో విధులు నిర్వర్తించాల్సిన ఆర్వో అధికారులకు నిర్వహించిన పరీక్షఫలితాలు అందరినీ షాకింగ్ గురిచేశాయి. చాలా మంది అధికారులు ఆ పరీక్షలో ఫెయిల్ కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎన్నికల సంఘం ఇటీవల నిర్వహించిన సర్టిఫైడ్‌ శిక్షణ కార్యక్రమానికి హాజరై, పరీక్ష రాసిన ఎన్నికల రిటర్నింగ్‌ అధికారు(ఆర్‌వో)ల్లో నాలుగో వంతుకు పైగా అధికారులు ఫెయిలయ్యారు. మూడో వంతుకు పైగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారు(ఏఆర్‌వో)లు సైతం ఫెయిల్‌ అయ్యారు. ఎన్నికల ఏర్పా ట్లు, నిర్వహణ అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం గత నెల 24 నుంచి 27 వరకు నాలుగు రోజుల పాటు ఆర్‌వోలు, ఏఆర్‌వోల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరై పరీక్ష రాసిన 119 మంది రిటర్నింగ్‌ అధికారుల్లో 29 మంది, 251 అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల్లో 90 మంది ఫెయిలయ్యారు.

అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా రిట ర్నింగ్‌ అధికారులదే. వారి పరిధిలో ఉండి సహాయకులుగా ఏఆర్‌వోలు పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున 119 మంది రిటర్నింగ్‌ అధికారులతో పాటు 251 ఏఆర్‌వోలను ఎన్నికల సంఘం నియమించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసిన తర్వాత నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన వరకు ఆర్‌వోలు, ఏఆర్‌వోలు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఎన్నికల సంఘం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది.

కాగా.. ఫెయిల్ అయిన అధికారులకు మరోసారి శిక్షణ ఇచ్చి.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని భావిస్తున్నారు. ఆ పరీక్షలో పాస్ మార్క్ వచ్చిన వారికి మాత్రమే ఎన్నికల నిర్వహణ బాధ్యత అప్పగించనున్నారు. 

click me!