తెలుగు అకాడమీ స్కామ్: గతంలో ముంబైలో కిడ్నాప్, సత్యనారాయణ రావు లీలలు

By telugu teamFirst Published Oct 2, 2021, 11:47 AM IST
Highlights

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రావు గురించి విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. 

హైదరాబాద్: తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ లో కీలక పాత్ర పోషించిన ఏపీ మర్కంటైల్ బ్యాంక్ చైర్మన్ సత్యనారాయణ రావు గురించి విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లను నగదు రూపంలో మార్చడానికి అతనికి రూ.6 కోట్ల రూపాయలు యూనియన్ బ్యాంక్ మేనేజర్ మస్తాన్ వలీ నుంచి రూ.6 కోట్ల రూపాయలు కమిషన్ గా ముట్టినట్లు చెబుతున్నారు. 

తెలుగు అకడామీ గత ఏడాది డిసెంబర్ నుంచి ఏ ఏడాది జులై వరకు యుబిఐ కార్వాన్, సంతోష్ నగర్ శాఖల్లో దాదాపు రూ. 60 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసింది. ఆ ఫిక్స్ డ్ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడానికి గత నెల 24వ తేదీన తెలుగు అకాడమీ ప్రయత్నించింది. అయితే, అందులో జీరో బ్యాలెన్స్ ఉన్నట్లు తేలింది. దాంతో తెలుగు అకాడమీ అధికారులు హైదరాబాదు నగర క్రైమ్ బ్రాంచ్ (సీసీఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యుబిఐ బ్యాంక్ మేనేజర్లను ప్రశ్నించారు. ఆ సొమ్ము తమ బ్యాంక్ నుంచి ఏపీ మర్కంటైల్ సొసైటికి బదిలీ అయినట్లు వాళ్లు విచారణలో చెప్పారు. 

Also Read: తెలుగు అకాడమీ స్కామ్: కోట్లు కొట్టేసి ఇన్నోవా కారులో నగదు తరలింపు, రూ. 6 కోట్లు కమిషన్

కాగా, ఏపీ మర్కంటైల్ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రావు తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్ల గోల్ మాల్ లో ప్రధాన పాత్ర పోషించాడు. అతన్ని గతంలో ముంబైలో నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. విజయవాడ కేంద్ర మర్కంటైల్ సొసైటీ కార్యకలాపాలను అతను కొనసాగిస్తున్నాడు. నాగపూర్ లో కూడా ఓ శాఖను తెరిచాడు. నిరుడు మార్చిలో అంకిత్ జైన్ అనే వ్యక్తి సత్యనారాయణ రావుకు ఫోన్ చేశాడు. మీ బ్యాంకులో రూ.5 కోట్లు డిపాజిట్ చేస్తానని, ముంబైకి వచ్చి డబ్బులు తీసుకోవాలని అంకిత్ జైన్ సత్యనారాయణతో చెప్పాడు. 

హైదరాబాద్ శాఖ మేనేజర్ మొహియుద్దీన్ తో కలిసి సత్యనారాయణ ముంబైకి వెళ్లాడు. వారిద్దరు రైల్వే స్టేషన్ లో దిగగానే అంతిక్ జైన్ ఫోన్ చేసి కారు పంపుతున్నట్లు చెప్పి సత్యనారాయణను ఒక్కడినే రమ్మన్నాడు. కారులో ఎక్కగానే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు కూడా ఎక్కారు. కారులోనే సత్యనారాయణను కొట్టారు. రహస్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి కోటి రూపాయలు డిమాండ్ చేశారు. చివరకు రూ.37 లక్షలకు బేరం కుదిరింది. 

కిడ్నాపర్లు మొహియుద్దీన్ కు ఫోన్ చేసి డబ్బులు జమ చేయాలని ఖాతా నెంబర్ ఇచ్చారు. దాంతో అతను విజయవాడ నుంచి డబ్బులు తెప్పించుకుని ఖాతాల్లో జమ చేశాడు. నగదు చేరిన వెంటనే కిడ్నాపర్లు నగదు, బంగారు ఆభరణాలు తీసుకుని రూ.300 ఇచ్చి పూణే హైవేపై వదిలేశారు. ఈ సంఘటనపై సత్యనారాయణ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 

click me!