మరో పదేళ్లు కేసీఆరే సీఎం, కాంగ్రెస్‌ను ఇగ్నోర్‌ చేయలేం: కేటీఆర్ ఆసక్తికరం

By narsimha lodeFirst Published Jan 1, 2020, 4:54 PM IST
Highlights

తెలంగాణ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


హైదరాబాద్: మరో పదేళ్ల పాటు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగానే కేసీఆర్ ఈ విషయాన్ని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో అనుమానాలు  అవసరం లేదన్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బుధవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు.తాను చిన్నప్పుడు బీజేపీ ఎలా ఉందో ఇవాళ కూడ బీజేపీ అలానే ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీని విస్మరించలేమని ఆయన స్పష్టం చేశారు. 

ఈ నెలలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎక్కువ మంది పోటీ పడుతున్నారని కేటీఆర్ చెప్పారు. 

రెబెల్ అభ్యర్ధులు బరిలో ఉంటే పార్టీకి నష్టమన్నారు. రెబెల్ అభ్యర్ధులను  కాళ్లు పట్టుకొనో, కడుపులో తలపెట్టో పోటీ నుండి నివారించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ తెలిపారు.కొత్త మున్సిపల్ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే  తన ముందున్న లక్ష్యంగా మంత్రి కేటీఆర్ చెప్పారు.

జిల్లాల్లో పార్టీ భవనాలను సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నట్టుగా  కేటీఆర్ తెలిపారు. ఏపీ రాష్ట్రంలో కూడ పోటీ చేయాలని ట్విట్టర్ ద్వారా తనను కోరుతున్నారని ఆయన గుర్తు చేశారు. 

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవి నుండి తప్పుకొంటున్నట్టుగా ప్రకటన విషయమై తాను మాట్లాడబోనని చెప్పారు.హైద్రాబాద్‌లో కూడ సీఏఏ అనుకూల, వ్యతిరేక ర్యాలీలు జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు సరూర్‌నగర్ ‌లో సభ నిర్వహించుకొంటామంటే పోలీసులు అనుమతి ఇచ్చేవాళ్లేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వకపోతే దుర్భాషలాడడం సరైందికాదన్నారు. 

click me!