తెలంగాణలో రాబోయే మూడ్రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వివరాలు ఇవే..

Sumanth KPublished : Jun 5, 2023 8:31 AM

తెలంగాణలో ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్‌: తెలంగాణలో ఓ వైపు ఎండలు దంచికొడుతుంటే.. మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు ఉరుములు, మెరుపులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆవర్తన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. దీంతో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. 

ఇదిలా ఉంటే, రానున్న ఏడు రోజులు రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు స్థిరంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్నిచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 45.5 డిగ్రీలసెల్సియస్, పెద్దపల్లి జిల్లాలో 45.1 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్‌ జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇక, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, కుమురం భీమ్, మేడ్చల్-మల్కాజిగిరి, నారాయణపేట, నిర్మల్, వరంగల్, హన్మకొండ, ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది.

Read more Articles on
click me!