
హైదరాబాద్ : తెలంగాణ వర్సిటీ వీసీ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కి మరింత ఇబ్బందుల్లో కూరుకు పోయాడు. తెలంగాణ వర్సిటీ వీసీ దాచేపల్లి రవీందర్ తన ఇంట్లో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దాసరి శంకర్ అనే వ్యక్తి నుంచి భీంగల్ లో పరీక్షా కేంద్రం ఏర్పాటు కోసం రూ.50వేలు లంచం తీసుకుంటుండగా దాడి చేసిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణ వీసీ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్ మీద గత వారమే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ టీం నేరుగా యూనివర్సిటీలోని ఆయన ఛాంబర్ లో సోదరులు నిర్వహించింది. ఆ సమయంలో అక్కడ ఏమేం దొరికాయి అన్నది గోప్యంగానే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ తార్నాక లోని ఆయన నివాసంలో శనివారం ఉదయం వీసీ లంచం తీసుకుంటుండగా దొరికిపోయాడు.
ప్రభుత్వానికి అందిన నివేదిక.. తెలంగాణ వర్సిటీ వీసీపై త్వరలో వేటు..?
భీంగల్ లోని డిగ్రీ కాలేజీకి ఎగ్జామ్స్ సెంటర్ ఏర్పాటు చేయాలంటే రూ.50,000 లంచం డిమాండ్ చేయడంతో.. దాసరి శంకర అనే వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారు మాటువేసి వీసీని పట్టుకున్నారు.
ఇదిలా ఉండగా తెలంగాణ వర్సిటీ వీసి రవీందర్ పై త్వరలో వేటు పడే అవకాశాలు ఉన్నాయి. వైస్ ఛాన్స్లర్ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదిక అందినట్లుగా సమాచారం. ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేసినట్లుగా ఆధారాలు కూడా ఉండడంతో విసిపి చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ప్రతిపాదనలు పంపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బుధవారం తెలంగాణ వర్సిటీలో అవుట్సోర్సింగ్ సిబ్బంది విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. వేతనాలు కోరుతూ సిబ్బంది, ఆహారం లేక తాము పస్తులు ఉండాల్సి వస్తుందని విద్యార్థులు నిరసనకు దిగారు. సమస్యలను పరిష్కరించకుంటే రాజీనామా చేయాలని వీసిని డిమాండ్ చేశారు.