
తాజా మాజీ రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని మెకానిక్ దుర్మరణం పాలయ్యాడు. ఆదివారం రాత్రి తాండూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మహేందర్ రెడ్డి 8.30 ప్రాంతంలో తిరిగి ఇంటికి బయలుదేరారు.
ఈ క్రమంలో ఆయన కాన్వాయ్లోని పైలట్ వాహనం రోడ్డుపై వాహనాలను దారి మళ్లీస్తూ వేగంగా ముందుకు వెళుతోంది. సరిగ్గా ఇదే సమయంలో యెంకలపల్లి గేట్ వద్ద ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ను నడుపుతున్న వ్యక్తి ఎగిరి రోడ్డు మీద పడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
సమాచారం అందుకున్న పరిగి పోలీసులు వాహనాన్ని నడిపిన కానిస్టేబుల్ శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు మృతుడిని మైలారం దేవరంపల్లికి చెందిన మెకానిక్ మహిపాల్ రెడ్డిగా గుర్తించారు.
ప్రమాదానికి కారణమైన కానిస్టేబుల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వాహనాల లైట్ల వెలుతురు కారణంగా తనకు ఎదురుగా వస్తున్న బైక్ కనిపించలేదన్నాడు. అతనిపై కేసు నమోదు చేసి వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేశారు.