
తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల శాసనసభలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రంలో తొలి విడుతగా 30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు జారీ చేసింది. మరోవైపు టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల నియామకానికి ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహణకు సెకండరీ స్యూల్ ఎడ్యుకేషన్కు రాష్ట్ర సర్కార్ అనుమతిచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు.
అంతేకాకుండా టెట్ అర్హతల్లో ప్రభుత్వం మార్పు చేసింది. 2015 డిసెంబర్ 23న టెట్కు సంబంధించి జారీచేసిన జీవో 36లో ప్రధానంగా రెండు సవరణలు చేస్తూ ప్రభుత్వం తాజాగా జీవో 8 ఇచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఆదేశాల మేరకు ఈ మార్పులు చేశారు. ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు టెట్ అర్హత కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలానికి సవరించారు. టెట్ అర్హత జీవితకాలం వర్తించేలా మార్గదర్శకాలు జారీచేశారు. 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ మార్పు వర్తిస్తుంది. అప్పటి నుంచి నిర్వహించిన టెట్ పరీక్షల్లో అర్హత సాధించినవారి సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ పొందాయి.
మరోవైపు ఈ సారి టెట్ పేపర్ 1కు బీఈడీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటివరకు బీఈడీ అభ్యర్థులు 6 నుంచి 10 తరగతులకు బోధించేందుకు అర్హులు. అందుకు టెట్లో పేపర్-2 రాస్తే సరిపోయేది. అయితే ఇక నుంచి బీఈడీ చేసిన అభ్యర్థులు.. 1 నుంచి 5 తరగతులకు బోధించే ఎస్జీటీ ఉద్యోగాలకు అర్హత పొందనున్నారు. ఇందుకోసం బీఈడీ అభ్యర్థులు టెట్లో పేపర్ -1 రాయాల్సి ఉంటుంది. అయితే ఇలా ఉద్యోగాల్లో చేరిన బీఈడీ అభ్యర్థులు రెండేళ్లలోపు ప్రాథమిక విద్య బోధనలో ఆరు నెలల బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలనే నిబంధన విధించారు. ఇక, డీఈడీ అభ్యర్థులు మాత్రం.. కేవలం టెట్లో పేపర్-1 రాసేందుకు అర్హులు.
ఇక, త్వరలోనే టెట్ నోటిఫికేషన్ విడుదల కానున్నట్టుగా తెలుస్తోంది. మే నెలలో టెట్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2016 మే, 2017 జూలైలలో టెట్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.