సమ్మక్క- సారలమ్మ జాతరకు 3,845 బస్సులు.. అందుబాటులోకి యాప్, కాల్ చేస్తే బస్సు: టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్

By Siva KodatiFirst Published Feb 4, 2022, 9:29 PM IST
Highlights

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లేవారి కోసం తెలంగాణ ఆర్టీసీ 3,845 బస్సులు నడుపుతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు. మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ తీసుకొచ్చామని .. 30 మంది ప్రయాణికులు ఉంటే 040 30102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు
 

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ.. మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు (sammakka sarakka jatara) టిఎస్ఆర్టీసి (tsrtc) అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసి ఎండి సజ్జనార్ (sajjanar) వివరాలు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరకు తొందరగా వెళ్లాలంటే ఆర్టీసి బస్సు ఎక్కాలని ఆయన ప్రయాణికులకు సూచించారు.  మేడారం విత్ టిఎస్ ఆర్టీసి యాప్ (tsrtc app) ప్రవేశపెట్టామని.. ఆర్టీసి చరిత్రలోనే మొదటిసారి ఈయాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ యాప్ లో ఆర్టీసీ సర్వీసులు, మేడారం జాతర విశిష్టతో పాటు ఇతర టూరిస్టు ప్రాంతాలు, ప్యాకేజీలతోపాటు ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్లు, సమీపంలోని హోటల్స్ కంటాక్టులను ఉంచామని తెలిపారు. 

50 ఏళ్లుగా ఆర్టీసీ మేడారానికి బస్సులను నడుపుతోందని ఆయన గుర్తుచేశారు. మొదట రెండెంకల బస్సులతో 1970లో ప్రారంభమయ్యిందని.. ప్రస్తుతం అది 7 వందలకు పెరిగిందని సజ్జనార్ అన్నారు. గతేడాది 19 లక్షలకు పైగా భక్తులను మేడారం చేర్చామని... అప్పుడు 3వేలకు పైగా బస్సులు- 50వేలకు పైగా ట్రిప్పులు నడిపామని ఆయన వెల్లడించారు. మేడారం జాతరను రెవెన్యూగా చూడలేదని .. గతేడాది 30 కోట్ల ఆదాయం వచ్చిందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సారి 3,845 బస్సులు నడుపుతున్నామని.. మొత్తం 51 పాయింట్స్ నుంచి మేడారానికి బస్సులు తిరుగుతాయని చెప్పారు.  ఇతర రాష్ట్రాలు నుంచి కూడా బస్సులు నడుపుతున్నామని సజ్జనార్ వెల్లడించారు. 

Latest Videos

30 మంది ప్రయాణికులు ఉంటే 040 30102829కి కాల్ చేస్తే బస్సు పంపుతామన్నారు. ఆర్టీసీ వెబ్ సైట్‌ను చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఈనెల 13వ తేదీ నుంచి జాతరలో రద్దీ పెరుగుతుందని.. 12వేల మంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటున్నారని సజ్జనార్ పేర్కొన్నారు. 8 రోజుల పాటు ఆర్టీసి అధికారులు మేడారంలో ఉంటారని, 50 ఎకరాల్లో బేస్ క్యాంప్ ఆర్టీసి ఆధ్వర్యంలో ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్టీసి ఆధ్వర్యంలో 3 వందల మంది ప్రత్యేకంగా వాలంటర్స్ గ్రౌండ్‌లో ఉంటారని, వరంగల్ నుంచి 2 వేలకు పైగా బస్సులు నడుపుతున్నామని టీఎస్ఆర్టీసీ ఎండి తెలిపారు. 

స్పెషల్ బస్సులన్నీ కండక్టర్ లెస్‌గానే వుంటాయని.. ప్రైవేటు పార్కింగ్ స్థలం నుంచి 30 షెటిల్ బస్సులు నడుస్తాయని, 11 మొబైల్ మెకానికల్ టీమ్స్ మేడారం రూట్‌లో అందుబాటులో ఉంటాయని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసి ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూం , సిసి టివి కెమెరాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. బస్సులు మార్గమధ్యలో ఎక్కడా ఆగకుండా 25 ఛేజింగ్ స్కాడ్ టీమ్‌లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఆర్టీసి ఆధ్వర్యంలో రెండు కళా బృందాలను సైతం ఏర్పాటు చేశామని సజ్జనార్ తెలిపారు.
 

click me!