తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

By narsimha lodeFirst Published Jun 30, 2020, 2:49 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు హైకోర్టుకు తెలిపింది.
 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం నాడు హైకోర్టుకు తెలిపింది.

తెలంగాణలో జూలై మాసంలో పలు కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇదివరకే షెడ్యూల్ ను విడుదల చేసింది. 

also read:లాక్‌డౌన్ విధిస్తే కామన్ ఎంట్రెన్స్ టెస్టులు ఎలా నిర్వహిస్తారు: తెలంగాణ హైకోర్టు ప్రశ్న

జూలై 1వ తేదీన పాలిసెట్, జూలై 1 నుండి 3 వరకు పీజీఈసెట్, జూలై 4న ఈసెట్, జూలై 6 నుండి 9వరకు ఎంసెట్, జూలై 10న లాసెట్, లా పీజీసెట్, జూలై 13న ఐసెట్, జూలై 15న ఎడ్ సెట్ నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలన్నీ ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్నిఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదౌతున్నాయి. ఈ తరుణంలో లాక్ డౌన్ విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రెండు మూడు రోజుల్లో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి లాక్ డౌన్ విషయమై ఓ స్పష్టమైన ప్రకటన చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.

రాష్ట్రంలోని కామన్ ఎంట్రన్స్ టెస్టులను వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.ఈ పిల్ పై ఇవాళ హైకోర్టు విచారణ చేసింది. లాక్ డౌన్ విధిస్తే కామన్ ఎంట్రన్స్ పరీక్షలు ఎలా నిర్వహిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 

దీంతో ప్రభుత్వంతో చర్చించి ఇవాళ మధ్యాహ్నం నిర్ణయం చెబుతామని అడ్వకేట్ జనరల్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటలకు హైకోర్టు ఈ విషయమై విచారణను తిరిగి ప్రారంభించిన తర్వాత రాష్ట్రంలో కామన్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

పాలీసెట్ కు 20 వేలు, జూలై 4 జరగాల్సిన ఈసెట్ కు 28వేలు,జూలై 15న నిర్వహించే ఎడ్ సెట్ కు 44వేలు,జూలై 10న లాసెట్ కు 29వేల ధరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. వాయిదా వేసిన ప్రవేశ పరీక్షలను ఎప్పుడు నిర్వహించిందో తర్వాత ప్రకటించనున్నారు. 

click me!