
హైదరాబాద్ లోని ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఇవాళ ఓ ఆసక్తికర దృష్యం కనిపించింది. అదేమిటంటే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు ఇంటిముందు సందడి చేయడం. కాన్వాయ్తో సహా తలసాని శ్రీనివాస్ చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. అయితే మీడియా చుట్టుముట్టడంతో ఖంగారుగా వెనుతిరిగి వెళ్ళిపోయారు. రోడ్ నెంబర్ 36కు వెళ్ళడానికి ఇటువైపు వచ్చానని అంతకు మించి వేరే రాజకీయ అంశాలు ఏమీ లేవని మీడియాకు సర్ధిచెప్పడానికి ప్రయత్నించారు మంత్రి. చంద్రబాబు ఇక్కడ ఉన్న విషయమే తనకు తెలియదని పొరపాటున వచ్చినట్లు తలసాని వివరించారు.
ప్రస్తుత రాజకీయ పరిణామాలను చూస్తే అతడు చంద్రబాబు ను కలవడానికే అక్కడికి వెళ్లినట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్, కారు కలిసి పనిచేయనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అంతే కాకుండా ఈ మధ్య మోత్కుపల్లి లాంటి టిడిపి సీనియర్ నాయకులు కూడా పొత్తుకు అవకాశం ఉందన్నట్లు మాట్లాడిన విషయం తెలిసిందే. అంతే కాకుండా తెలంగాణ సీఎం కేసిఆర్ కూడా అనంతపురం లో ఏపి మంత్రి పరిటాల సనీత కొడుకు పెళ్లికి వెళ్లడం అక్కడ తెలుగుదేశం నేతలతో చర్చలు జరపడం జరిగింది. ఈ విషయాలన్ని చూస్తే టిడిపి తో టీఆర్ఎస్ దోస్తీ కట్టనున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంపై మాట్లాడడానికేమైనా తలసాని చంద్రబాబును కలవడానికి వెళ్లాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే చంద్రబాబు నగరంలోనే ఉండటంతో అతడి ఇంటి వద్ద వున్న మీడియా కంటికి చిక్కడంతో తలసాని వారిని తప్పించుకునే ప్రయత్నం చేశారు. జూబ్లీ హిల్స్ లో ట్రాఫిక్ జామ్ ఉన్నందున రోడ్ నెంబర్ 36 నుంచి వెళ్లినట్లు తెలిపారు. మంత్రి కాన్వాయ్ కి ట్రాఫిక్ అడ్డంకి ఉంటదా అని జనాల్లో చర్చ షురూ అయింది. అయితే తలసాని ఏపీ పీఎం చంద్రబాబు ఇంటివద్దకు రావడంలో ఏదో మతలబు ఉందని రాజకీయ వర్గాల్లో అప్పుడే చర్చ మొదలైంది.