అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్నను తెలంగాణ మంత్రులు అభినందించారు. సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ ఈ చీరను తయారు చేశారు.
అగ్గిపెట్టెలో పట్టేంత చీర నేసిన సిరిసిల్లకు చెందిన యువ నేతన్న నల్ల విజయ్ (nalla vijay) ను తెలంగాణ మంత్రులు అభినందించారు. మంగళవారం హైదరాబాదులో మంత్రులు కేటీఆర్ (ktr), ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao), సబితా ఇంద్రారెడ్డి (sabitha indra reddy), శ్రీనివాస్ ల గౌడ్ (srinivas goud)ల సమక్షంలో నేతన్న విజయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చీరను ప్రదర్శన చేశారు. దీనిని ఆసక్తిగా గమనించిన మంత్రులు చీర వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. విజయ్ పై ప్రశంసల జల్లు కురుపించారు. ఈ చీరను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల నేత రంగంలో అనేక మార్పులు వచ్చాయని చెప్పారు. విజయ్ నైపుణ్యాన్ని మెచ్చుకున్నారు. అనంతరం విజయ్ మాట్లాడారు. సిరిసిల్ల నేత కార్మికుల ఆధునిక మరమగ్గాల వైపు, ఆధునిక పద్ధతుల వైపు మరలుతున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడు తాను నేసిన చీర మూడు రోజుల్లో మర మగ్గాలతో నేయవచ్చని అన్నారు. అయితే ఈ చీరను చేతితో నేయాలంటే రెండు వారాలు పడుతుందని విజయ్ అన్నారు. నేతన్న నైపుణ్యాన్ని కొనియాడిన మంత్రులు.. ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు ప్రభుత్వం సంపూర్ణంగా సహకారం అందిస్తుందని చెప్పారు. అయితే తన కొత్త యూనిట్ ప్రారంభోత్సవానికి రావాలని మంత్రి కేటీఆర్ ను విజయ్ కోరారు. దీనికి మంత్రి సుముఖత వ్యక్తం చేశారు.