
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (talasani srinivas yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) , తెలంగాణను (telangana) మళ్లీ కలిపేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని పాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి రాజ్యసభలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించ పరిచేలా ప్రధాని మోదీ పార్లమెంట్లో వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి అని విమర్శించారు.
గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్దిలో ముందుకెళ్తే బీజేపీ నేతలు ఓర్వలేకపోతున్నారని తలసాని మండిపడ్డారు. కేంద్రం తెలంగాణకు ఒక్క జాతీయ ప్రాజెక్ట్ అయినా ఇచ్చిందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటే విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు.. తెలంగాణపై మోదీ వ్యాఖ్యలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పేవరకు బీజేపీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
అంతకుముందు పార్లమెంట్లో ప్రధాని మోదీ వ్యాఖ్యలకు వ్యతికేరంగా సికింద్రాబాద్లో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి తలసాని పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు అవుతుందని.. రాష్ట్రానికి బీజేపీ నేతలు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో ఓడిపోతామని తెలిసి బీజేపీ నేతలు కొత్త నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సింగరేణి జోలికొస్తే తెలంగాణ భగ్గు మంటుందని హెచ్చరించారు. సింగరేణి తెలంగాణ హక్కు అని, దానిని ప్రైవేటీకరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.