
హైదరాబాద్: తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విమర్శించారు. ఏ రాష్ట్రం ఎంత అభివృద్ది చెందుతుందో ప్రజలకు తెలుసునని అన్నారు. బొత్స మాట్లాడినందుకు తాము కూడా మాట్లాడాల్సి వస్తుందని.. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అని విమర్శలు గుప్పించారు. రాజధాని ఎక్కడంటే చెప్పుకోలేని పరిస్థితి అని అన్నారు. వారికి తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదని అన్నారు. నెలకొకసారైనా హైదరాబాద్కు రాకుంటే ఆయన ప్రాణం ఊరుకోదని అన్నారు. అలాంటిది హైదరాబాద్ గురించి, తెలంగాణ గురించి మాట్లాడటం సరికాదని అన్నారు.
టీఎస్పీఎస్సీ పరీక్షలపై డౌట్ ఉందని డయల్ 100కు ఫోన్ వస్తే.. ఎంక్వైరీ చేసి.. పాతళంలోకి వెళ్లి లీకేజ్ను పట్టుకున్నామని చెప్పారు. స్కామ్తో సంబంధం ఉన్నవారిని అరెస్ట్ చేశామని.. ఇందుకు అభినందించాల్సి ఉందన్నారు. ఆనాడూ నీళ్లు, నిధులలో అన్యాయం చేశారని.. ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్పీలో దందాలు నడిపారని ఆరోపించారు. గతంలో ఏపీపీఎస్సీలో స్కామ్లు జరిగాయని ఆరోపించారు. తెలంగాణ వాళ్లను ఎన్నో రకాలుగా కించపరిచే విధంగా మాట్లాడరని అన్నారు. అలా జరగకుండే ఏపీ, తెలంగాణ కలిసే ఉండేయని అన్నారు.
తాము చూచిరాత రాస్తున్నామా?.. వాళ్లు చూడకుండా రాస్తున్నారా? అని ప్రశ్నించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. బొత్స సత్యనారాయణ బాధ్యతయుతమైన వ్యక్తిగా మాట్లాడలేదని అన్నారు. ఏ రాష్ట్రంలో ఎన్ని ఆస్పత్రులు కట్టుకున్నారనేది అందరికి తెలుసునని అన్నారు. అక్కడివారికి అనారోగ్యం వస్తే చికిత్స కోసం ఎక్కడికి వస్తున్నారని ప్రశ్నించారు.
బొత్సకు తెలంగాణ మీద ఉన్న అక్కసు ఈరోజు బయటపడిందని అన్నారు. గతంలో కూడా ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తాము కించపరిచే విధంగా మాట్లాడాలంటే.. చాలా ఉన్నాయని చెప్పారు. విద్వేషాలు రెచ్చగొట్టడం మంచిది కాదనే తాము మాట్లాడటం లేదని తెలిపారు. ఏపీ వాళ్లు బతకడానికి హైదరాబాద్కు వస్తే కడుపులో పెట్టుకుంటున్నామని చెప్పారు. రాజకీయ లబ్ది కోసమే బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు.