
Telangana: హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డు లో ముఖ్యంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'నీరా కేఫ్' పనులను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. రాష్ట్ర గౌడ సంఘాల ప్రతినిధులు, ఆబ్కారీ, పర్యాటక శాఖల ఉన్నతాధికారుల తో కలసి పరిశీలించారు. అక్కడ ఆయన నీరాను కూడా సేవించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల మరుగున పడిపోతున్న కుల, చేతి వృత్తుల కు పూర్వ వైభవాన్ని తేవాలనే లక్ష్యం తో ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ లోని ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డు లో 25 కోట్ల రూపాయల తో ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా నీరా కేఫ్ ను నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా కొనసాగిస్తూ.. ప్రజలకు ఆరోగ్యాన్ని, 15 రకాల వ్యాధుల నివారణకు ఔషధ గుణాలు కలిగిన నీరా, కల్లు ను హైదరాబాద్ నగరంలో నిషేధం విధించి అవమానించారన్నారు. గీత వృత్తిని, వృత్తిదారులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న కొంతమంది అహంకార పూరిత రాజకీయ నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని కుల సంఘాల ప్రతినిధులకు పిలుపునిచ్చారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో నీరా ఉత్పత్తికి ప్రాథమికంగా యాదాద్రి భువనగిరి జిల్లా లోని నందనం గ్రామంలో, సంస్థాన్ నారాయణ పురం మండలం సర్వేలు గ్రామంలో, సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని మునిపల్లి గ్రామంలో, రంగారెడ్డి జిల్లా లోని అమనగల్లు మండలం చరికొండ గ్రామంలో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గీత కార్మికుల సంక్షేమం కోసం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం అందించే ఎక్స్గ్రేషియా ను రైతు బంధు తరహాలో అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆత్మ గౌరవ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. కుల, చేతి వృతుల పూర్వ వైభవానికి సీఎం కేసీఆర్ గారు అనేక చర్యలు చేపట్టారని మంత్రి వెల్లడించారు.
నీరా కేఫ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీరా పానీయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి దాని వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ప్రజలకు వివరిస్తామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కొంతమంది కులాలను, కులవృత్తి కార్మికులను అవమానించే విధంగా అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెబుతామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. నీరా కేఫ్ పరిశీలన పనుల్లో మంత్రి వెంట రాష్ట్ర BC కమిషన్ సభ్యులు K. కిషోర్ గౌడ్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, టూరిజం MD మనోహర్, ఉప్పల్ RTO పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, గౌడ సంఘాల రాష్ట్ర ప్రతినిధులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, బాలరాజు గౌడ్, చింతల మల్లేశం గౌడ్, వట్టికూటి రామారావు గౌడ్, నాగేశ్వరరావు గౌడ్, వేములయ్య గౌడ్, ప్రశాంత్ గౌడ్, అయిలీ వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, ఈతముల్లు ప్రసాద్, మమత గౌడ్,గడ్డమీడి విజయ్ కుమార్ గౌడ్, సంజయ్ గౌడ్ లతో పాటు ప్రొహిబిషన్& ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు అజయ్ రావు, హరికిషన్, డేవిడ్ రవికాంత్, చంద్రయ్య, సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయ్ భాస్కర్ గౌడ్, CI లు లక్ష్మణ్ గౌడ్, తమటం లక్ష్మణ్ గౌడ్ తదితరులు ఉన్నారు.