#Tahsildar Vijaya: ఘటనాస్థలిని సందర్శించిన సబితా ఇంద్రారెడ్డి

By sivanagaprasad KodatiFirst Published Nov 4, 2019, 4:35 PM IST
Highlights

తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి ఉద్యోగులను హత్య ఎలా జరిగిందన్నదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

తహశీల్దార్ విజయారెడ్డి దారుణహత్య నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడి ఉద్యోగులను హత్య ఎలా జరిగిందన్నదానిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.  

ఓ అధికారిపై దాడి సరికాదని పేర్కొన్నారు. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. కార్యాలయంలోనే ఇటువంటి సంఘటన జరగడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తుంటారని.. ప్రభుత్వాధికారులతో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఉన్నతాధికారులను ఆశ్రయించాలి కానీ ప్రాణాలు తీయడం సరైన చర్య కాదన్నారు. నిందితులు ఎవరైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సబిత స్పష్టం చేశారు.

మరోవైపు విజయారెడ్డి హత్యతో రెవెన్యూ ఉద్యోగులు భగ్గుమన్నారు. అబ్ధుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో కార్యాలయం బయట ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. అలాగే వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో సిబ్బంది విధులు బహిష్కరించారు.

Also Read:తహిసీల్దార్ విజయారెడ్డి హత్య.. ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన దుండగుడు

మరోవైపు అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేసిన ఘటనపై తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పట్టపగలు ఒక మహిళా ఉద్యోగిని ఇలా క్రూరంగా హత్యచేయటం అత్యంత దారుణమన్నారు.

దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని.. అలాగే ఉద్యోగులకు పూర్తి రక్షణ కల్పించాలని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో ఏ విధంగా పనిచేయాలని మహిళా ఉద్యోగోలు విలపిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతకంటే ఘోరమైన అన్యాయం ఉండదని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దోషులు ఎంతటివారైనా వదలొద్దని రవీందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్ధితుల్లో రెవెన్యూ ఉద్యోగులందరూ ఏకతాటిపై వుండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు విధులును బహిష్కరించి నిరసన తెలియజేయాల్సిందిగా రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని  అబ్దుల్లాపూర్‌మెట్టు తహసీల్దార్ కార్యాలయంలోకి ఓ దుండగుడు సోమవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు వచ్చాడు.తహసీల్దార్ విజయారెడ్డితో మాట్లాడాలంటూ ఆమె చాంబర్‌లోకి వెళ్లాడు. తహసీల్దార్ కార్యాలయంలోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెపై పెట్రోల్ పోశాడు. వెంటనే ఆమెకు నిప్పంటించాడు.

Also Read:telangana mro : తహసీల్దార్ విజయా రెడ్డి సజీవ దహనం.. నిందితుడు సురేష్‌

అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఇద్దరు వ్యక్తులు  విజయారెడ్డిపై మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో విజయారెడ్డిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరికి గాయాలు అయ్యాయి.

మరోవైపు విజయారెడ్డిన హతమార్చిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అతను సురేష్ అని పేర్కొన్నారు. తీవ్రగాయాలైన సురేష్.. ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తహశీల్దార్ కార్యాలయం నుంచి పోలీసు స్టేషన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడినుంచి ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారని సమాచారం.

అయితే విజయారెడ్డిపై పెట్రోల్‌పై దాడిచేసే ముందు చేయికూడా చేసుకున్నారని తెలుస్తోంది. అతను దాడి చేయడంతో విజయారెడ్డి ఆరిచారని.. అరుపులను డ్రైవర్ విన్నారని పోలీసులు చెప్తున్నారు. సురేశ్ వెళ్లడంతో విజయారెడ్డి ఉన్న గదికి తాళం వేశారని తెలుస్తోంది. పథకం ప్రకారమే అతను వచ్చినట్టు అర్థమవుతుంది

click me!