
హైదరాబాద్ : Bodhan incidentపై రాష్ట్ర హోం మంత్రి Mahmood Ali .. డీజీపీ మహేందర్ రెడ్డి, నిజామాబాద్ కమిషనర్ నాగరాజులతో మాట్లాడారు. ఉద్రిక్తతలకు దారి తీసిన పరిస్థితులపై మంత్రి ఆరా తీశారు. ఘర్షణ వాతావరణాన్ని అదుపు చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని… కమిషనర్ ఇతర పోలీసు అధికారులు బోధన్ లోనే ఉండి సమీక్షిస్తున్నారు అని DGP హోం మంత్రికి వివరించారు. సీఎం KCR తెలంగాణలో అన్ని మతాలు, కులాలకు సమానమైన ప్రాధాన్యత కల్పిస్తూ నాయకుడిగా ఉన్నారని ఈ సందర్భంగా home minister అన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సమానమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది నిరంతరం అప్రమత్తతతో ఉన్నారని, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉండగా, ఆదివారంనాడు నిజామాబాద్ జిల్లా బోధన్లో శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం చోటు చేసుకుంది. బోధన్ లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనారిటీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోటికి ఇరువర్గాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పిన ఇరువర్గాలు వినిపించుకోలేదు. పరిస్థితులు చేయిజారకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
పరిస్థితి ఉద్రిక్తం…
ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులను పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బోధన్ పోలీసులు పట్టణంలో 144 సెక్షన్ విధించారు. అయితే బోధనలో పరిస్థితి అదుపులోనే ఉందని సిపి వెల్లడించారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ శివాజీ విగ్రహానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసులు భయానక వాతావరణం సృష్టించొద్దని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. విగ్రహాన్ని తొలగిస్తే అక్కడే ఏర్పాటు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎంతో మంది హిందువులను చంపిన వ్యక్తి టిప్పుసుల్తాన్ అంటూ ఫైర్ అయ్యారు. దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడిన ఒకే ఒక్క వ్యక్తి చత్రపతి శివాజీ అని రాజా సింగ్ కొనియాడారు. పోలీసుల రక్షణ కల్పించాలని.. లేనిపక్షంలో హైదరాబాద్ నుంచి బోధన్ కు చేరుకుంటామని ఆయన హెచ్చరించారు. పరిసరాల్లో ఉన్న హిందువులు ఏకం చేస్తామన్నారు.
బోధన హిందువులపై దాడిని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. హిందూ యువకులపై ఎంఐఎం,టిఆర్ఎస్ పోలీసులు కలిసి దాడి చేశారని అన్నారు. శివాజీ విగ్రహం పెట్టడం కోసం మున్సిపల్ కౌన్సిల్ ఆరు నెలల క్రితమే తీర్మానం చేసిందన్నారు. ఆ తీర్మానం ప్రకారం విగ్రహం పెడితే అడ్డుకుంటారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాళ్ల దాడి చేయడం మూర్ఖత్వం అన్నారు. బైంసాలో జరిగినట్లే బోధనలలోనూ జరుగుతోందని ఆరోపించారు. హిందువులకు తాము అండగా ఉంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. శివాజీ పాకిస్తాన్ నుంచి లేదా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. శివాజీ విగ్రహం ఎందుకు పెట్టకూడదో చెప్పాలని డిమాండ్ చేశారు.