మాజీ మిత్రుడికి కేసీఆర్ సర్‌ప్రైజ్.. బర్త్ డే విషెస్ చెబుతూ ఈటలకు స్పెషల్ లెటర్

By Siva KodatiFirst Published Mar 20, 2022, 9:54 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయనకు లేఖ రాశారు. ఈ వ్యవహారం తెలంగాణ  రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 

హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పుట్టినరోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ (kcr) లేఖ రాశారు. మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని  కోరుకుంటున్నా’’ అని లేఖలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు, బీజేపీ ప్రముఖులు, హుజూరాబాద్‌ కార్యకర్తలు ఈటలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.  

కాగా.. టీఆర్ఎస్‌ను వీడిన తర్వాత హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad byPoll) బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసిన ఈటల రాజేందర్ ఘన (etela rajender) విజయం సాధించారు. తద్వారా వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ ఏడింటిలో నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించగా.. మూడు సార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి మూడుసార్లు ఈటల గెలిచారు.  

Latest Videos

తొలుత కమలాపూర్‌ (kamalapur) నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించగా.. ఆ తర్వాత ఐదు సార్లు హుజురాబాద్ నుంచే విజయ బావుట ఎగురవేశారు. ప్రస్తుత ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది. 2004లో అత్యత్పలంగా 19 వేల మెజారిటీతో గెలుపొందిన ఈటల..  2010 ఎన్నికల్లో అత్యధికంగా 79 వేల మెజారిటీ సాధించారు. తాజాగా జరిగిన ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు పోలవ్వగా... టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,712 ఓట్లు పడ్డాయి. తద్వారా దాదాపు 24 వేల పైచీలుకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. 

మరోవైపు .. ఇటీవలే ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ తరపున తొలిసారి సభలోకి అడుగుపెట్టినరోజే ఈటల రాజేందర్ సహా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించింది కేసీఆర్ సర్కారు. స్పీకర్ నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లినా సానుకూల ఫలితం రాలేదు. ఇన్నాళ్లు తనకు శిష్యుడిలా వున్న ఈటల ముఖం చూడటం ఇష్టంలేకే కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య కేసీఆర్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. నేరుగా ఈటలకే ప్రత్యేక లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

click me!