రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం..ప్లాస్టిక్ వల్లే రెస్క్యూ ఆలస్యం : హోంమంత్రి మహమూద్ అలీ

By Siva KodatiFirst Published Jan 19, 2023, 5:58 PM IST
Highlights

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న స్థలాన్ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ పరిశీలించారు. భవనంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్నామని మంత్రి చెప్పారు.

సికింద్రాబాద్ రామ్‌గోపాల్ పేటలో అగ్నిప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించారని అన్నారు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ. 22 ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే గోడౌన్‌లో స్టాక్ ఎక్కువగా వుండటంతో మంటలు అదుపులోకి రావడం లేదని హోంమంత్రి వెల్లడించారు. ఫైర్ డిపార్ట్‌మెంట్ డీజీ నాగిరెడ్డి దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని మహమూద్ అలీ తెలిపారు. భవనంలో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయినట్లుగా అనుమానిస్తున్నామని మంత్రి చెప్పారు. అలాగే ఇద్దరు ఫైర్ సిబ్బంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. 

కొద్దిగంటల్లోనే మంటలను అదుపు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జీహెచ్ఎంసీ , ఫైర్ సిబ్బందితో కలిసి ముందు జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రమాదం జరిగిందని హోంమంత్రి వెల్లడించారు. భవనం నిండా ప్లాస్టిక్ వుండటంతో మంటలను అదుపు చేసేందుకు ఆరు గంటలుగా శ్రమిస్తున్నామని మహమూద్ అలీ చెప్పారు. ప్రమాదంలో పలువురు చనిపోయినట్లుగా అనుమానిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని హోంమంత్రి స్పష్టం చేశారు. 

ALso REad: రామ్‌గోపాల్ పేట అగ్నిప్రమాదం: అదుపులోకి రాని మంటలు.. కూలుతున్న స్లాబులు, బిక్కుబిక్కుమంటోన్న స్థానికులు

అయితే గంటలు గడుస్తున్నా మంటలు ఇంకా అదుపులోకి రావడం లేదు. మరోవైపు డెక్కన్ స్టోర్ భవనం ప్రమాదకర స్థితికి చేరుకుంది. భవనం లోపల 3, 4 అంతస్తుల స్లాబులు కుప్పకూలాయి. మంటల ధాటికి రెగ్జిన్ మెటీరియల్స్ భారీగా తగలబడుతున్నాయి. కార్లకు సంబంధించిన ఫైబర్ మెటీరియల్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఫైబర్, సింథటిక్ మెటీరియల్స్ కారణంతో రెండు స్లాబులు కుప్పకూలాయి. ఒక్కొక్క స్లాబ్ కూలుతూ వుండటంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. 

click me!