గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓట్ల ను అనుమతించొద్దని దాఖలైన పిటీషన్ పై టీఎస్ హై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు పిటీషన్ ను మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ దాఖలు చేశారు.
గ్రేటర్ ఎన్నికల్లో ఎక్స్అఫిషియో ఓట్ల ను అనుమతించొద్దని దాఖలైన పిటీషన్ పై టీఎస్ హై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు పిటీషన్ ను మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ దాఖలు చేశారు.
తన పిటిషన్ లో అనిల్ కుమార్ ఎక్స్అఫిషియో ఓట్లకు అనుమతించే జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 90(1)ను సవాలు చేశారు. ఈ సెక్షన్ చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని, సెక్షన్ ను కొట్టివేయాలని పిటిషన్ దారు కోరారు.
ఈ సెక్షన్ వల్ల కార్పొరేటర్ సీట్లు ఎక్కువ గెలిచినప్పటికీ ఎక్స్అఫిషియో ఓట్లతో మేయర్ ను ఎన్నుకోలేకపోతున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో ఉన్న 150 వార్డుల్లో 55 మంది ఎక్స్అఫిషియో ఓట్లు ఉన్నాయన్నారు.
మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో 55 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు వేయనున్నారని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎక్స్అఫిషియో ఓటింగ్ కల్పించడం ద్వారా స్థానిక ప్రజల ఉద్దేశం నీరుగారిపోతుందని పిటిషనర్ పేర్కొన్నారు.
ఈ పిటిషన్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్ఎంసీలను ప్రతివాదులగా చేర్చారు. ఈ పిటీషన్ పై నేడు తెలంగాణ హై కోర్టులో విచారణ జరగనుంది.