తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేయడం కలకలం రేపింది. ఈ క్రమంలో పలు హాస్పిటల్స్ను సీజ్ చేయడంతో పాటు మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో తనిఖీలు చేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అనుమతులు, కనీస సదుపాయాలపై ఆరా తీస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖీ చేశారు జిల్లా వైద్య శాఖ అధికారులు. అనుమతులు, మౌలిక వసతులు పాటించని ఐదు ల్యాబ్లు, ఒక ఆసుపత్రిని సీజ్ చేయడంతో పాటు మరో ఆరు హాస్పిటల్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నారాయణపేట జిల్లాలోనూ తనిఖీలు జరిగాయి. డీఎంహెచ్వో రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మక్తల్లోని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్స్లో సోదాలు చేశారు. అనధికారికంగా కొనసాగుతోన్న రెండు ప్రైవేట్ క్లినిక్లను సీజ్ చేశారు. అటు వరంగల్ జిల్లాలోనూ తనిఖీలు జరిగాయి. ఆసుపత్రుల నిర్వహణ లోపాలను సవరించుకోవాలని సూచించారు. అనుమతులు లేకపోతే మాత్రం సీజ్ చేస్తామని హెచ్చరించారు.