TS Elections: ఎన్నికల తనిఖీల్లో ఆల్ టైం రికార్డ్.. రూ. 745కోట్ల మార్కు దాటిన సొత్తు

By Rajesh KarampooriFirst Published Nov 30, 2023, 6:29 AM IST
Highlights

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన నాయకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిపై ప్రత్యేక ద్రుష్టి సారించడంతో పెద్ద ఎత్తున నగదు, నగలు, మద్యం పట్టుబడుతున్నాయి.  ఇప్పటి వరకూ ఎన్ని వందల కోట్లు సొత్తు పట్టుబడిందంటే..? 

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి బరిలో నిలిచిన అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారిని వశం చేసుకోవడానికి నగదు, మద్యం, విలువైన లోహాలను అందిస్తూ ప్రలోభపెడుతున్నారు. దీంతో ఓటర్లకు ప్రలోభాలపై ఎన్నికల సంఘం ప్రత్యేక ద్రుష్టి పెట్టింది. రాష్ట్ర అధికారులు, పోలీసుల సమన్వయంతో  పకడ్బందీ చర్యలు చేపట్టింది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో  భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుబడుతున్నాయి. 

కాగా..  అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్‌ 9 నుంచి నవంబర్‌ 29 వరకు  745.37 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెలలో ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో అత్యధిక జప్తుగా చెబుతున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు గత 24 గంటల్లో రూ. 8.07 కోట్ల విలువైన నగదు, విలువైన లోహాలు, మద్యం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో మొత్తం విలువ రూ.745 కోట్లకు చేరుకుంది.  అక్టోబర్ 9 నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. 
 
2018 ఎన్నికల్లో నగదు, మద్యం, ఇతర వస్తువుల స్వాధీనం రూ.103.89 కోట్లు మాత్రమే. కాగా.. నవంబర్ 29 ఉదయం 9 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో ఏజెన్సీలు రూ.3.78 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి. దీంతో అక్టోబర్ 9 నుంచి పట్టుబడిన నగదు రూ.305.72 కోట్లకు చేరింది. అలాగే.. 24 గంటల వ్యవధిలో రూ.2.66 కోట్ల విలువైన మద్యాన్ని కూడా ఏజెన్సీలు సీజ్ చేశాయి.

Latest Videos

దీంతో ఇప్పటివరకు పట్టుబడిన మద్యం మొత్తం విలువ రూ.127.55 కోట్లకు చేరింది. 2.63 లక్షల లీటర్లకు పైగా మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత 24 గంటల్లో రూ. 27.94 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు ఇప్పటివరకు రూ. 40.14 కోట్ల విలువైన డ్రగ్స్/నార్కోటిక్‌లను స్వాధీనం చేసుకున్నాయి. స్వాధీనం చేసుకున్న ఎక్కువగా 10,086 కిలోల గంజాయి ఉంది.

అదే సమయంలో స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, వజ్రాలు తదితర వాటి విలువ రూ.187 కోట్లకు చేరింది. ఇందులో 303 కిలోల బంగారం, 1,195 కిలోల వెండి, 19,297 క్యారెట్ల వజ్రాలు ఉన్నాయి. ఎన్నికల కోడ్ (MCC) అమలులోకి వచ్చినప్పటి నుండి.. ఓటర్లకు ఉచితంగా పంపిణీ చేయడానికి ఉద్దేశించిన రూ. 84.94 కోట్ల విలువైన ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న వాటిలో 2.98 లక్షల కిలోల బియ్యం, 9,207 కుక్కర్లు, 89,329 చీరలు, ఏడు ద్విచక్ర వాహనాలు, 10 కార్లు, 18,566 గడియారాలు, 72,473 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం ఉండడంతో మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లు గట్టి నిఘా ఉంచాయి.ఓటరులకు నగదు, మద్యం, ఉచితాలు పంపిణీ చేస్తున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఓటరులకు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కొన్ని చోట్ల నిరసనలు చేపట్టారు.

click me!