
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో కొత్త ఇన్ఛార్జ్ మాణిక్రావు థాక్రే వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పరిస్ధితులు, పార్టీలో పరిణామాల గురించి తెలుసుకుంటున్నారు. ఇన్ఛార్జ్ అయ్యాక తొలిసారి గాంధీ భవన్కు వచ్చిన మాణిక్రావు థాక్రేకు నేతలు స్వాగతం పలికారు. ఆ తర్వాత నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో భేటీలు ముగిశాయి. ఇవాళ, రేపు కాంగ్రెస్ నేతలతో భేటీలు కొనసాగనున్నాయి. సాయంత్రం టీపీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది.
కాగా.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగోర్ స్థానంలో కొత్తగా మాణిక్ రావ్ ఠాక్రేను హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. అటు మాణిక్యం ఠాగోర్కు గోవా ఇంచార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ పేరిట బుధవారం ప్రకటన విడుదలైంది.
ఇక మాణిక్రావు విషయానికి వస్తే.. మహారాష్ట్రకు చెందిన ఆయన కాంగ్రెస్లో సీనియర్ నేతగా వున్నారు. 1985 నుంచి 2004 వరకు ధార్వా అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సుశీల్ కుమార్ షిండే, విలాస్ రావు దేశ్ముఖ్, శరద్ పవార్ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేశారు. అలాగే మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా, మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగానూ మాణిక్ రావు విధులు నిర్వర్తించారు.
సీనియర్లు అసమ్మతి వీడతారా..?
తెలంగాణ కాంగ్రెస్లో పీసీసీ కమిటీల నియమాకం చిచ్చును రాజేసిన సంగతి తెలిసిందే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సీనియర్లు గళం వినిపించారు. ఒర్జినల్ కాంగ్రెస్ నినాదం ఎత్తుకున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన కాంగ్రెస్ హైకమాండ్.. తమ దూతగా సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దింపింది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో పర్యటించిన దిగ్విజయ్ సింగ్ పార్టీ నేతలతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితి సద్దుమణిగినట్టుగా కనిపించకలేదు.
ఇటీవల నిర్వహించిన టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ నేతలు డమ్మా కొట్టారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, శ్రీధర్ బాబు హాజరుకాలేదు. అయితే ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జ్గా మాణిక్రావు థాకరేను ఏఐసీసీ అధిష్టానం నియమించింది. అయితే మాణిక్కం ఠాగూరుపై సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొత్త ఇంచార్జ్ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో.. సీనియర్లు తమ అసమ్మతిని వీడాతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.