ఎన్ని అడ్డంకులు వచ్చినా సచివాలయం కడతాం: స్పష్టం చేసిన కేసీఆర్

By Siva KodatiFirst Published Aug 16, 2019, 9:59 AM IST
Highlights

ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణకు కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహాన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన  ఎట్ హోం  కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు

ఎన్ని అడ్డంకులు ఎదురైనా తెలంగాణకు కొత్త అసెంబ్లీ, సచివాలయం నిర్మించే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహాన్ రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన  ఎట్ హోం  కార్యక్రమానికి కేసీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్‌తో కాసేపు ముచ్చటించిన ఆయన సచివాలయం నిర్మాణంపై చర్చించారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త సచివాలయం నిర్మిస్తున్నామని... ప్రస్తుత సచివాలయం గజిబిజీగా ఉందని చివరికి పార్కింగ్‌కు సైతం అనువుగా లేదని ముఖ్యమంత్రి తెలిపారు.

సెప్టెంబర‌లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని.. వాటిలోనే కొత్త రెవెన్యూ బిల్లును ప్రవేశపెడతామని.. మున్సిపల్ చట్టాలకు సవరణలు కూడా తీసుకొస్తామని సీఎం పేర్కొన్నారు.

విభజన సమస్యలను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకుంటామని, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంలో ప్రాజెక్టులన్నీ నిండాయని మరిన్ని జలాలు వచ్చే అవకాశం వుందని తెలిపారు.

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ ప్రజాప్రతినిధులతోనే ఎట్ హోం కార్యక్రమం జరిగింది. గంటపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు స్పీకర్ పోచారం. తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

మరోవైపు ఐటీ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోవాలని పారిశ్రామికవేత్త, బీవీఆర్ మోహన్ రెడ్డి సీఎం కేసీఆర్‌ను కోరారు. ఎట్ హోం కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. 

click me!