
రేపు అసెంబ్లీలో (telangana assembly budget session ) కీలక ప్రకటన చేస్తున్నట్లు చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) . మంగళవారం వనపర్తి జిల్లా (wanaparthy district) నాగవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ .. నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని కోరుకుంటున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి ఎన్నో కార్యక్రమాలను చేపట్టామన్నారు సీఎం కేసీఆర్. వనపర్తి జిల్లా కేంద్రం అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదన్నారు. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్దిలో దూసుకుపోతోందని కేసీఆర్ పేర్కొన్నారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్ధితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాకముందు మహబూబ్నగర్ జిల్లాలో (mahabubnagar district) ఒక్క మెడికల్ కాలేజీ కూడా లేదని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ వచ్చాక మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని సీఎం వెల్లడించారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందన్న కేసీఆర్.. పాలమూరు జిల్లా పాలుగారుతోందని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ధాన్యపురాశులతో కళకళలాడుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి తెలంగాణకు వచ్చారని.. అలాగే తెలంగాణకు పనుల కోసం 11 రాష్ట్రాల నుంచి వస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని (palamuru lift irrigation project) పూర్తి చేస్తామన్న ఆయన.. తాను సంతోషం పట్టలేక పొలాల్లోకి వెళ్లి చూశానని గుర్తుచేశారు. అద్భుతమైన వజ్రపు తునక నా పాలమూరు జిల్లా అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. పాలమూరు అభివృద్ధి కోసం నిరంజన్ రెడ్డి ఎంతో కష్టపడి పనిచేశారని సీఎం ప్రశంసించారు. నిరంజన్ రెడ్డి (niranjan reddy) ఈసారి లక్ష ఓట్ల మెజారిటీతో గెలవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తెలంగాణ ఎలా అభివృద్ది చెందిందో భారతదేశం అంతా అలాగే అభివృద్ధి చెందాలని సీఎం కోరుకున్నారు.
ఈ మధ్య దేశంలో గోల్మాల్ గోవిందం గాళ్లు తయారయ్యారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని .. దేశం కోసం పోరాడేందుకు ముందుకు వెళ్లాలని సీఎం పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా కొట్లాడామో.. దేశం కోసం అలాగే కొట్లాడదామని కేసీఆర్ పేర్కొన్నారు. దేశం కోసం తన ప్రాణాలైనా అర్పిస్తానన్న ఆయన స్పష్టం చేశారు.