
తెలంగాణలోని (telangana rains) భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. చెరువులు, కుంటలు, డ్యామ్లు, రిజర్వాయర్లలో నీటి పరిస్ధితిపై కేసీఆర్ ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని కేసీఆర్ సూచించారు.
అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని సీఎం ఆదేశించారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్ధితిని సమీక్షించాలని సూచించారు. అలాగే వర్షాలు, వరదల వల్ల ప్రాణనష్టం జరగకుండా చూడాలని కేసీఆర్ ఆదేశించారు. జనజీవనానికి ఆటంకాలు లేకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో వరద ప్రవాహం పెరిగే అవకాశం వుందని సీఎం హెచ్చరించారు.
Also Read:భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోండి.. అత్యవసరమైతేనే బయటకు రండి: హైదరాబాద్ సీపీ
మరోవైపు.. తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్తో పాటు పలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించడంతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ (hyderabad police commissioner) సీవీ ఆనంద్ (cv anand) ప్రజలకు పలు సూచనలు చేశారు.
హైదరాబాద్కు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించిందని గుర్తుచేశారు. ఈరోజు రాత్రి, రేపు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పారు. భారీ వర్షాల వల్ల ప్రజలు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. చిన్నపిల్లలతో పాటు నగర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాత్రి, పగలు పోలీసులు అందుబాటలో ఉంటారని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు.