విమర్శలకు తెర.. ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్

By Siva KodatiFirst Published Jul 11, 2020, 4:26 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎట్టకేలకు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రెండు వారాలుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న ఆయన.. త్వరలో రైతులతో సమావేశం కానున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఎట్టకేలకు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. రెండు వారాలుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే ఉన్న ఆయన.. త్వరలో రైతులతో సమావేశం కానున్నారు.

కాగా రాష్ట్రంలో కరోనా వైరస్ వెలుగు చూసిననాటి  నుంచి ప్రతిరోజూ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వచ్చిన కేసీఆర్.. అత్యవసర సందర్భాల్లో తనే మీడియా ముందుకు వచ్చేవారు.

అలాంటిది తెలంగాణలో కోవిడ్ ఉగ్రరూపం దాలుస్తున్నా ప్రగతి భవన్‌లో కనిపించకపోవడం విమర్శలు తావిచ్చింది. దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా శనివారం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా కరోనా వ్యాప్తితో భయం గుప్పిట్లో ఉంటే కేసీఆర్ మాత్రం ఫాంహౌస్ లో పడుకున్నారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందని, రాష్ట్రంలో ప్రతి రోజూ 3480 టెస్టులు మాత్రమే చేస్తున్నారని, అయినా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని ఆయన అన్నారు. టెస్టులు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రమాదంలో పడిందని ఆయన వ్యాఖ్యానించారు. 

వనరులను అన్నింటినీ ప్రజల ప్రాణాలను కాపాడడానికి వాడాలని ఆయన సూచించారి. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని 50 శాతం పడకలను స్వాధీనం చేసుకోవాలని, వాటిని కరోనాకు కేటాయించాలని, పడకల ఖాళీల వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

హైదరాబాదులోని హోటళ్లను కూడా స్వాధీనం చేసుకోవాలని, వాటిని క్వారంటైన్ కోసం వాడాలని మల్లుభట్టి విక్రమార్క సూచించారు. ప్రజలకు భరోసా ఇవ్వాలని ఆయన కోరారు.

ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రులకు వెళ్తే కరోనా టెస్టులు చేసే వరకు వైద్యం చేయడం లేనది, రిపోర్టులు వచ్చే సరికి ఐదారు రోజులు పడుతోందని ఆయన అన్నారు. ఈ లోగా వ్యాధి ముదిరి చనిపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. 

click me!