కేంద్రం దిగొచ్చే వరకు పోరాడండి.. మీ వెంటే మేమంతా : రైతులకు కేసీఆర్ పిలుపు

By Siva KodatiFirst Published May 22, 2022, 5:44 PM IST
Highlights

కేంద్రం దిగొచ్చే వరకు పోరాడాలని రైతులకు పిలుపునిచ్చారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం చంఢీగడ్‌లో జరిగిన కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో కలిసి రైతులు, గాల్వాన్ లోయ ఘర్షణలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆయన ఆర్ధిక సాయం అందించారు. 

75 ఏళ్ల స్వాతంత్ర్యం తర్వాత కూడా దేశ పరిస్ధితి చూస్తే బాధేస్తోందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr). చంఢీగడ్‌లో (chandigarh) గాల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో (galwan valley martyrs) ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు, సాగు చట్టాలకు (farm laws) వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో (farmers agitation) ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (bhagwant mann) , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లతో (arvind kejriwal) కలిసి కేసీఆర్ ఆర్ధిక సాయానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గర సమస్యలు వున్నాయన్నారు. 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా రైతులు పోరాడారని కేసీఆర్ ప్రశంసించారు. ప్రాణ త్యాగం చేసిన రైతులను వెనక్కి తీసుకురాలేమని.. గాల్వాన్‌లో చైనాతో జరిగిన పోరాటంలో పంజాబ్ సైనికులు కూడా చనిపోయారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్ ఎన్నికల వల్ల సైనికుల కుటుంబాలను  కలవలేకపోయానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రోజుకు పది మంది రైతులు చనిపోయేవారని.. కరెంట్ కోతలు తీవ్రంగా వుండేవని కేసీఆర్ గుర్తుచేశారు. 

Also Read:kcr delhi tour : ఢిల్లీలో సర్వోదయ పాఠశాల, మొహల్లా క్లినిక్‌ను సందర్శించిన కేసీఆర్.. వెంట కేజ్రీవాల్

తెలంగాణ ఏర్పడిన తర్వాత 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీలోని కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి తెస్తోందని.. రైతుల కోసం చేసే ఏ మంచి పనైనా కేంద్రంలోని ప్రభుత్వానికి నచ్చదన్నారు. రైతు నేతలు తమ ఆందోళనలను కొనసాగించాలని.. దేశంలోని రైతులంతా కలిసి పోరాడాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. రైతుల పోరాటానికి తమ మద్ధతు వుంటుందని సీఎం హామీ ఇచ్చారు. తన ప్రాణాలు పోయినా మీటర్లు పెట్టబోనని కేసీఆర్ స్పష్టం చేశారు. 

click me!